CM KCR | గద్వాల్ : కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అనే నినాదంతో నేను ఆమరణ దీక్ష పడితే మీరంతా ఎక్కడివారు అక్కడ పులిబిడ్డల్లాగా కొట్లాడితే అప్పుడు దిగొచ్చి ప్రకనట చేశారు. మళ్లా వెనక్కి తీసుకున్నారు. మళ్లీ అందరం కలిసి బ్రహ్మాండంగా కొట్లాడితే తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ఇచ్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. గద్వాల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
కృష్ణా, తుంగభద్ర అనే రెండు నదుల మధ్య ఉన్న నడిగడ్డను కూడా ఆగం పట్టించారు కాంగ్రెస్ నాయకులు. ఆర్డీఎస్ ఆగం పట్టించిన పార్టీ ఎవరిది..? ఆ చరిత్ర కూడా మీ ముందున్నది. ఆనాడు కరువుతో ఏడ్సినం. ఇక తప్పదు అని చెప్పి.. నేను ఉద్యమం మొదలుపెడితే పిడికెడు మందిమి ఉన్నప్పటికీ నా వెంట మీరంతా నడిచారు. అందరం కలిసి పులిబిడ్డల్లాగా లేచి కొట్లాడితే.. 2004లో తెలంగాణ ఇస్తామని మాటిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పొత్తుతో ఇక్కడ, ఢిల్లీలో గెలిచారు. కాంగ్రెస్ నేతృత్వంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. ఇవ్వకపోగా అనేక కథలు పడ్డారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చే ప్రయత్నం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని మలినం పట్టించే ప్రయత్నం చేశారు.
చివరకు మంటరేగి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ దీక్ష పడితే మీరంతా ఎక్కడివారు అక్కడ పులిబిడ్డల్లాగా కొట్లాడితే అప్పుడు దిగొచ్చి ప్రకనట చేశారు. మళ్లీ బ్రహ్మాండంగా కొట్లాడితే చిట్టచివరి దశలో తెలంగాణ ఇచ్చారు. ఇందతా చరిత్ర ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.
నాటి ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులు నీళ్ల గురించి కొట్లాడలేదు. రఘువీరారెడ్డి వస్తే అనంతపురం దాకా నీళ్లు తీసుకువెళ్లమని మంగళ హారతులు పట్టారు. వాళ్లచరిత్ర ఏందో మీకు తెలుసు. కృష్ణమోహన్ రెడ్డి ఏం చేసిండో.. ఆ చరిత్ర మీ ముందే ఉంది. గతంలో నెట్టెంపాడు కింద 20 వేల ఎకరాలు పారలేదు. ఇవాళ లక్ష 60 వేల ఎకరాలు పారుతుంది. ర్యాలంపాడు రిజర్వాయర్ పెద్దగ చేసి నీళ్లు తెస్తే గద్వాల పచ్చబడ్డది. గట్టు మండలానికి నీళ్లు కావాలని గట్టు ఎత్తిపోతల పథకం కూడా తెచ్చాం. పనులు జోరుగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రం చేసుకున్నాం. కలెక్టరేట్ కట్టుకున్నాం. అన్నిరకాలుగా గద్వాల అభివృద్ధి చెందింది. కృష్ణమోహన్ రెడ్డిని దీవించాలని కోరుతున్నాను. గద్వాలలో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ వచ్చింది. 300 పడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం. కొత్త బస్టాండ్ చేసుకున్నాం. జూరాల వద్ద అద్భుతమైన గార్డెన్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. పేదల సంక్షేమం చేశాం అని కేసీఆర్ తెలిపారు.
ఈ నియోజకవర్గంలో వాల్మీకి బోయ సోదరులు ఉంటారు. ఆంధ్రాలో ఎస్టీలు, మన వద్ద బీసీలు, రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం. మోదీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. బహుషా యుద్ధం చేయాల్సి వస్తదేమో. వాల్మికీ బోయల కొంపముంచింది.. ఏపీ మొదటి సీఎం నీలం సంజీవరెడ్డి. వాళ్లను ఆంధ్రాలో ఎస్టీలు పెట్టి, ఇక్కడ బీసీల కింద పెట్టింది. ఈ చరిత్ర కూడా తెలుసుకుని, ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.