CM KCR | ఉమ్మడి పాలనలో వలసలతో పాలమూరు అల్లాడిపోయిందని, ప్రస్తుతం పాలమూరు అభివృద్ధిని చూస్తుంటే ఆనందమనిపిస్తున్నదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావ్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. అనంతరం బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. పాలమూరు అనగానే బిల్క్లింటన్, విదేశీయులు, ప్రపంచ బ్యాంకువారిని తీసుకువచ్చి చూపించారు. భయంకరమైన పరిస్థితులుండేవి. గతంలో తెలంగాణ కాకతీయ సామ్రాజ్యం ఉండే సమయంలో నాటి రాజులు 75వేల చెరువులు, కుంటలన మన బతుకుల కోసం తవ్వించారు.
వాటిని సమైక్య రాష్ట్రంలో మాయం చేశారు. తెలంగాణ వచ్చాక మనం చేసుకున్న మొదటి పథకం మిషన్ కాకతీయ. బ్రహ్మాండంగా చెరువులను అద్భుతంగా చేసుకున్నాం. మిషన్ కాకతీయ రాక ముందు నాగర్కర్నూల్ పాలెం, బిజినేపల్లి వడ్డెమాను చెరువు మురికి తుమ్మలు, లొట్టపీస్ చెట్లతో నిండి ఉండే. ఇవాళ కేసరి సముద్రం ఎలా తయారైంది. కాంగ్రెస్ పాలనలో కేసరి సముద్రంలో కంపసారి చెట్లు ఉండే. నేడు సుందరంగా తయారైంది. ఇప్పుడు గౌతమ బుద్ధుడు వెలిశాడు. జనం వచ్చి చూసివేళ్లె పర్యాటక ప్రాంతంగా కేసరి సముద్రం మారిందంటే తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత. దుందుబి వాగుపై గోరటి వెంకన్న పాట రాశాడు. ‘పెద్దవాగు ఎండిపాయెరా.. పేగు ఎండిపాయెరా’ అని తన పాటలో బాధపడ్డడు.
అదే వెంకన్నను అడిగితే.. వాగు నిండిపాయెరా.. అని పాడుతున్నడు. దుందుబి వాగుపై చెక్డ్యామ్లు కడితే ఎండకాలంలోనే నీళ్లు నిండి ఉన్నయ్. వాటిని చూసి నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయ్. ప్రజల బతుకు ముఖ్యం కాబట్టి.. దాని కోసం పోరాడాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు పెండింగ్లో ఉండే. తెలంగాణ రాకపోతే ఇప్పటికీ ముందట పడకపోవు. ఇవాళ ప్రభుత్వం చొరవతో ఇవాళ అవన్ని స్విచ్ఛాన్ అయ్యి 20లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకునే దిశగా ముందుకుపోతున్నాం. అచ్చంపేట ప్రాంతానికి రూ.2వేలకోట్లతో ఉమామహేశ్వర లిఫ్ట్ ప్రోగ్రామ్ను ప్రారంభించుకున్నాం. అచ్చంపేట ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలతో అప్పర్ ప్లాటోకు కూడా నీళ్లు ఇచ్చే ఏర్పాట్లు చేసుకున్నాం.
మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసుకోని, ప్రాజెక్టు నీటితో నింపుకున్నాం. బోరుబావులు ఎండిపోకుండా బ్రహ్మాండంగా నడుస్తున్నయ్. లక్షల ఎకరాల్లో పంటలు పండుతున్నయ్. ‘వలసలతో వలవల విలపించు కరువు జిల్లా.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి.. చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి.. పాలమూరు తల్లి పచ్చపైట కప్పుకున్నది’ అని నేనే నా కలంతో పాట రాసిన. హైదరాబాద్ నుంచి 200 గద్వాలకు వెళ్లిన సమయంలో కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లిన సమయంలో పంటలు, కల్లాలు, వడ్ల రాశులు చూసి ఆనందపడ్డ. ఈ మార్పు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లనే సాధ్యమైంది.
వలస వెళ్లిన వారంతా వాసప్ వచ్చారు. ఆ నాడు వలసపోయిన పాలమూరు జిల్లాకు బిహార్, జార్ఖండ్, ఒడిశా, యూపీ నుంచి నాట్లు వేసేందుకు కూలీలు వలస రావడం మనకు గర్వకారణం. తెలంగాణలో భూముల ధరలు బ్రహ్మాండంగా పెరిగినయ్. పాలమూరు గ్రామాల్లో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బొడ్రాయి పండగ చేసుకుంటున్నారంటే మా గుండెల నిండా సంతోషపడ్డాం. నాడు ఉద్యమంలో నాలుగైదు చోట్ల ఏడ్చాను. నడిగడ్డకుపోయిన ప్రజల దుస్థితి చూసి బాధపడ్డా. కన్నీళ్లు విడిచిన పాలమూరులో.. ఇంత అభివృద్ధి అద్భుతంగా మార్పు రావడం సంతోషంగా కనిపిస్తున్నది’ అన్నారు.