CM KCR | కోరుట్ల : బీడీ కార్మికులు కష్టజీవులు.. వారి బాధలను కండ్లారా చూశాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. ఎవరూ దరఖాస్తు పెట్టకముందే బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేశాను. కొత్తగా నమోదైన బీడీ కార్మికులకు తప్పకుండా పెన్షన్ మంజూరు చేస్తాను.. ఇది నా వాగ్దానం, రంది పడాల్సిన అవసరం లేదని కేసీఆర్ పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్కు మద్దతుగా ప్రసంగించారు.
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఎన్నో ఏండ్ల నుంచి మీ సేవలో ఉన్నారని కేసీఆర్ గుర్తు చేశారు. పార్టీల యొక్క నడవడిక, వైఖరి గురించి ఆలోచించాలి. గతంలో అవకాశం ఇస్తే ఏం చేశారో ఆలోచించాలి. ఉద్యమం ప్రారంభించినప్పుడు మీరు చాలా మంది ఉన్నారు. మెట్పల్లి, కోరుట్లకు వచ్చాను. మీరంతా కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. బీఆర్ఎస్ పదేండ్ల ప్రభుత్వంలో, 50 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ సొంత అనుభవంలో ఉంది. అవన్నీ బేరీజు వేసుకోవాలి. ఆలోచించి ఓటేయాలని కేసీఆర్ సూచించారు.
చేనేత కార్మికులు సిరిసిల్ల, భూదాన్ పోచంపల్లి, దుబ్బాకలో ఆరేడుగురు చనిపోవడం.. మేం పోయి ఆ శవాలను పట్టుకొని ఏడ్వడం జరిగాయని కేసీఆర్ గుర్తు చేశారు. పోచంపల్లిలో ఏడుగురు నేతన్నలు చనిపోతే నేను పోయి ఆ శవాలను పట్టుకొని అప్పుడున్న సీఎంకు రెండు చేతల దండం పెట్టి బతిమాలిడాను. ఒక యాభై వేలో, లక్ష రూపాయాలో ఇవ్వమని అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అని కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణ కష్టాలు ఏమున్నాయి అని మేధావులతో నాలుగు మాసాలు ఆలోచించినట్లు కేసీఆర్ తెలిపారు. మన కర్తవ్యం ఏందని కష్టపడి ఆలోచించి ఓ దారి పెట్టుకుని ముందుకు పోతున్నాం. మొదటగా పేదల సంక్షేమం గురించి ఆలోచించాం. అంతకు ముందు తమాషా కోసం పెన్షన్లు ఇచ్చేవారు. 70, 40, 200 పెన్షన్ చూశాం. కానీ వేల రూపాయాలకు తీసుకుపోయింది ఒక కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. నేను కొంతకాలం కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేశాను. బీడీ కార్మికులు 19 రాష్ట్రాల్లో ఉన్నారు. బెంగాల్, మహారాష్ట్ర చాలా రాష్ట్రాల్లో ఉంటారు. కానీ పెన్షన్ ఇవ్వరు అని కేసీఆర్ గుర్తు చేశారు.
నేను హైస్కూల్ చదువుకున్నప్పుడు దుబ్బాకలో బీడీలు చేసే వారి ఇండ్లో ఉన్నాను అని సీఎం తెలిపారు. అక్కడ నాలోకి రెండు అనుభవాలు వచ్చాయి. వారు చేనేత కార్మికులు కూడా. మగాయన చీరలు నేసేది.. నాకు అన్నం పెట్టే అమ్మ బీడీలు చేసేది. వారు తినే తిండి, అవస్థలు చూశాను. వాళ్ల బాధలు కండ్లారా చూశాను. వాళ్లకు వచ్చే రోగాలు ఏవో కూడా తెలుసు. బీడీ కార్మికులు కష్టజీవులు అని తెలుసు కాబట్టే.. నాకు ఎవరూ దరఖాస్తు పెట్టకముందే.. నా అంతకు నేను ఆలోచించి బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నాం. ఓట్ల కోసం, మోసం చేసేందుకు పెన్షన్లు ఇవ్వడం లేదు. ఎన్నికల ప్రణాళికలో చెప్పినవీ పది అయితే చెప్పకుండా చేసింది 100 కార్యక్రమాలు. బీడీ కార్మికుల పెన్షన్ రూ. 2 వేల నుంచి రూ. 5 వేలకు పోతది. గవర్నమెంట్ రాగానే మార్చిలో రూ. 3 వేలు అయితది. ఆ తర్వాత ఏడాదికి రూ. 500 పెరుగుతూ రూ. 5 వేలకు పోతది. బీడీ కార్మికులు ఎక్కడైతో ఉన్నారో.. కొత్త కార్మికులకు కూడా వంద శాతం పెన్షన్ మంజూరు చేస్తాను. ఇది నా వాగ్దానం.. రందీ పడాల్సిన అసవరం లేదు. ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాను అని కేసీఆర్ స్పష్టం చేశారు.