CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నా మీద జరిగిన దాడి.. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరిగి ఉండదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అయినా ఏనాడూ బాధపడులేదు. మీ తిట్లే దీవెనలు అనుకని ముందుకు వెళ్లానని కేసీఆర్ గుర్తు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని కేసీఆర్ గుర్తు చేశారు. జలదృశ్యంలో ఉన్న ఆయన ఇంట్లోనే మనం కార్యాలయం ఏర్పాటు చేసుకుని పనులు ప్రారంభించాం. కర్కశకంగా నాటి ప్రభుత్వం.. మన ఆఫీసును ధ్వంసం చేశారు. వస్తువులన్నీ బయట పడేశారు. అదే చోట అమరుల స్థూపం కట్టాలని, వారి ఆత్మ శాంతిస్తదని అదే జలదృశ్యంలో ఇంత చక్కగా.. అమరజ్యోతిని నిర్మించుకున్నాం అని కేసీఆర్ వివరించారు.
పార్టీ ఏర్పాటు తర్వాత, ఉద్యమంలో చాలా మంది నాతో విబేధించారు అని కేసీఆర్ తెలిపారు. చాలా గొప్పగా ఉద్యమం చేసి, తెలంగాణ రాష్ట్రం సాకారం చేసుకున్నాం. తెలంగాణ కోసం పదవులకు రాజీనామాలు చేశాం. లెక్కలెనన్ని సార్లు రాజీనామాలు చేశాం. తెలంగాణ ప్రజలే మమ్మల్ని కాపాడారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ముందుకు సాగాం. హింస రాకుండా చూశాం. నా మీద జరిగిన దాడి.. సమైక్యవాదులు, తెలంగాణలో ఉండే సమైక్య తొత్తులు బహుశా ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరిపి ఉండరు. అయినా ఏనాడూ బాధపడులేదు. మీ తిట్లే దీవెనలు అనుకని ముందుకు వెళ్లాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
సిద్దిపేటలో ఉద్యోగ గర్జన చేసినప్పుడు.. నాటి రోశయ్య ప్రభుత్వం హైదరాబాద్ ఫ్రీ జోన్ అని 14 ఎఫ్ తీసుకొస్తే నిరసన వ్యక్తం చేశాం అని కేసీఆర్ గుర్తు చేశారు. అప్పుడే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని ప్రకటన చేశాను. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అని బయల్దేరిన. నిమ్స్ డాక్టర్లు కూడా బెదిరించారు శక్తి లేదు.. కోమాలోకి వెళ్తే మళ్లీ బయటకు రాలేవని చెప్పారు. దాన్ని కూడా తట్టుకోని నిలబడ్డాను. విద్యార్థులు, నాయకులు నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఢిల్లీ సర్కార్ దిగివచ్చింది. లోక్సభలో చర్చ జరుగుతుంటే నేను నిమ్స్లో ఉండి చూశాను. మొత్తం భారత రాజకీయ వ్యవస్థ అప్పటి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తే ప్రకటన వచ్చింది. ఆ తర్వాత దీక్ష విరమించాను. ఆ తర్వాత కుట్రలు, సమైక్యవాదులు చేశారు. పార్లమెంట్లో కూడా పెప్పర్ స్ప్రేలు చల్లి తెలంగాణ రాకుండా అడ్డుకున్నారు. ఆ విషయాలు మీకందరికి తెలుసు అని కేసీఆర్ తెలిపారు.