హైదరాబాద్ : గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన బిర్సాముండా, కుమ్రంభీం, రాజీంగోండుల అడుజాడల్లోనే సీఎం కేసీఆర్ గిరిజనుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బిర్సాముండా జయంతి సందర్భంగా ఆమె గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని గిరిజన మ్యూజియంలో గిరిజన యోధులు కుమ్రంభీం, రాంజీగోడులపై నిర్మించిన డాక్యుమెంటరీలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కుమ్రంభీం వారసుడు కుమ్రం సోనేరావును సన్మానించారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్ ప్రవేశ పరీక్షల్లో సత్తాచాటిన గిరిజన గురుకులు, ఆశ్రమ, ఈఎంఆర్ఎస్ విద్యార్థులను మంత్రి అభినందించి, మెమెంటోలు అందించారు. అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అబిడ్జ్లో త్వరలో గిరిజన మ్యూజియానికి భూమిపూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. గిరిజన ఆరాధ్య దైవాలైన సమ్మక్క- సారలమ్మ జాతరను ఘనంగా నిర్వహించుకుంటూ, వారి సంస్కృతి, సంప్రదాయాలను తెలిపే విధంగా మ్యూజియం నిర్మించనున్నట్లు చెప్పారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మా గూడాల్లో మా రాజ్యం కావాలన్న నినాదం సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధ్యమైందన్నారు. దీన్ని ఆత్మగౌరవంగా భావించి, నేడు సమర్థవంతంగా పాలించుకుంటున్నారంటూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, అధికారులు సత్యనారాయణ, సముజ్వల, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.