హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్భానుసారంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. తనదైన శైలిలో ప్రతిపక్షాలకు చురకలంటిస్తూనే పార్టీ శ్రేణులను ఉత్తేజితులను చేశారు. తీర్మానాల సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించిన అనంతరం దాని కొనసాగింపుగా కేసీఆర్ మాట్లాడారు. దళితబంధుపై ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్వర్లు చేసిన ప్రసంగాన్ని కేసీఆర్ మెచ్చుకున్నారు.
దళితబంధుపై కేసీఆర్ మాట్లాడుతూ.. దళిత బంధు కార్యక్రమం మూడు రకాలుగా ఉంది. ఒకటి 119 నియోజకవర్గాల్లో ఈ మార్చిలోపే 100 మంది చొప్పున అమలు చేయబోతున్నాం. రెండోది మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, జుక్కల్ నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తున్నాం. దీనిపై ప్రతి ఒక్కరికీ ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. 100 మంది లబ్ధిదారుల్లో ఒకట్రెండు గ్రామాలను తీసుకోవచ్చు. హుజూరాబాద్ నుంచి మనకు గుణపాఠాలు వస్తున్నాయి. డబ్బులిచ్చి చేతులు దులపుకునే వ్యవహారం లేదు. ప్రభుత్వం ఇచ్చే లైసెన్సుల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. దళితబంధు పథకం అమలుకు సంబంధించి నిబంధనలు కఠినంగా లేవు. సులభంగా ఉన్నాయి. రూ. 10 లక్షల్లో రెండు వ్యాపారాలు పెట్టుకోవచ్చు. ముగ్గురు కలిసి రూ. 30 లక్షలతో వ్యాపారం చేసుకోవచ్చు. దళిత జాతిలో ఎటువంటి రత్నాలు ఉన్నాయనడానికి మెతుకు ఆనంద్, వెంకటేశ్వర్లు ప్రసంగం నిదర్శనం. వివక్షకు గురైన దళితజాతిని మనమే బాగు చేసుకోవాలి. ఆ బాధ్యత మనదే. తెలంగాణ సమాజానిదే. ప్రజల దయ ఉంటది. ఆశీర్వచనం ఉంటది. నూటికి నూరు శాతం ఈ కార్యక్రమంలో విజయం సాధిస్తాం. ఎవరో విమర్శించారో అని బాధపడాల్సిన అవసరం లేదు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
దళిత బంధు పథకం విషయంలో ప్రతిపక్షాల తీరును విమర్శిస్తూ.. మెతకు ఆనంద్ చెప్పిన మేకను కథను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మేకను, కుక్కను ఎక్కడ కట్టేయాల్నో ప్రజలకు తెలుసు. వాళ్లే కట్టేస్తారు అని ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ చురకలంటించారు.