హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్లీనరీలో దళితబంధుపై తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చెప్పిన కథ విని సీఎం కేసీఆర్ నవ్వారు.
ఆనంద్ చెప్పిన కథ ఏంటంటే.. దళిత బంధు పథకాన్ని కొంత మంది విమర్శిస్తున్నారు. కొందరు గప్పాలు కొడుతున్నారు. ఢిల్లీలో మేమే.. గల్లీలో మేమే అని అంటున్నారు. వీళ్లను చూసినప్పడు ఒక కథ గుర్తు వచ్చింది. ఒకాయన గప్పాలు కొడుతుంటాడు. మా వద్ద మేక ఉంది మీకు మంచి దావత్ ఇస్తా అని దోస్తులతో చెప్పేటోడు. కానీ దోస్తులు ఎప్పుడు అడిగినా కూడా ఏదో విషయం చెప్పి తప్పించుకుని పోయేవాడు. ఎందుకంటే వాళ్ల దగ్గరున్నది ఒకటే మేక. ఆ మేకను తీసుకపోయి దావత్ ఇస్తే భార్య చీపురుకట్ట తిప్పుతది. ఈరోజు ఎట్టైనా దావత్ తీసుకోవాలని ఫ్రెండ్స్ పట్టుకున్నారంట. ఇక భార్యను మచ్చిక చేసుకునేందుకు.. వంట బాగుంది.. ఇల్లు శుభ్రంగా పెట్టినవ్.. మీ అమ్మ బాగుందా? అని అడిగేసరికి ఆమె సంతోషించి పోయింది. మా ఆయన ఎంత మంచోడు చూడా సంబురపడింది. భార్య పెరట్లోకి వెళ్లగానే మేకను తీసుకపోయి దావత్ ఇచ్చి వచ్చిండు.
పొద్దున్నే భార్యను చూద్దామని వంటింట్లోకి పోతే అక్కడ భార్య లేదు. పెరట్లో కూడా లేదు. ఇంటి ముందర ఉన్న గుంజకు మేక కట్టేసి ఉంది. డౌట్ వచ్చి భార్యను అడిగితే.. రాత్రి తీసుకుపోయినా మేకనా? అని అడిగింది. నీ ఓవర్యాక్షన్ చూసి నేనే మేకను తీసుకుపోయి పెరట్లో కట్టేసిన.. నీవు మేకనో ఏదో చేస్తవు అని తెలిసిపోయింది. ఇక మేకను పెరట్లో కట్టేసి.. వీధి కుక్కను తీసుకొచ్చి ఇక్కడ కట్టేసిన అని చెప్పిందట. అంటే మన కేసీఆర్కు కూడా మేకల్ని ఎక్కడ కట్టేయాల్నో తెలుసు. వీధి కుక్కల్ని ఎక్కడ ఉంచాలో తెలుసు.. గొర్రెలను ఎవరికీ ఇయ్యాల్నో తెలుసు. బర్రెలను ఎవరికీ ఇయ్యాల్నో తెలుసు. ఆయన దళితులకు మాత్రమే బంధువు కాదు. సకల జనులందరికీ కేసీఆర్ బంధువు అని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పేర్కొన్నారు.