మధిర: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు మరింత పెరిగింది. ఇప్పటికే దాదాపు 70 సభల్లో మాట్లాడిన ఆయన ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దుమ్మెత్తిపోస్తున్నారు. మంగళవారం మధిరలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రపైన, కాంగ్రెస్ నేతల అడ్డదిడ్డమైన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓట్లేస్తే మోసోపోయి గోసపడుతరని హెచ్చరించారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే మధిర నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.
‘కాంగ్రెస్ టైమ్ల ఆడబిడ్డలు ప్రసవానికి ప్రైవేటు ఆస్పత్రులకు పోతే దోపిడీ. అవసరం లేకున్నా ఇష్టమొచ్చిన ఆపరేషన్లు చేసేటోళ్లు. ఇప్పుడు దర్జాగా అమ్మ ఒడి వాహనాలు నెలనెలా గర్భిణిలను ప్రభుత్వ దవాఖానలకు తీస్కపోయి, పరీక్షలు చేయించి, తగిన మందులు ఇచ్చి, ప్రసవానికి తీస్కపోయి, అబ్బాయి పుడితే రూ.1200 ఇచ్చి, అమ్మాయి పుడితే రూ.1300 వచ్చి, మళ్ల దర్జాగా తీసుకొచ్చి ఇంటికాడ దించుతున్నయ్. ఏ చరిత్రలనన్నా విన్నమా ఇది..? ఇట్ల ఒక మానవీయ దృక్పథంతోని మేం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినం. ఇయ్యాల ఆడబిడ్డ పెండ్లి చేసుకుంటే రూ.1 లక్ష కళ్యాణ లక్ష్మి ఇస్తున్నం. ఇట్ల అడుగడుగున మానవీయ కోణం కనపడతది. కాంగ్రెస్ హయాంలో రాక్షస కోణం ఉండె.. ఇయ్యాల మానవీయ కోణం కనపడుతున్నది’ అని సీఎం చెప్పారు.
‘కాంగ్రెసోళ్లు ఇంకేమంటున్నరు..? ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తరట. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క కూడా అదే మాట చెప్తున్నడు. ధరణిని తీసేసి దాని స్థానంలో భూమాత పెడ్తరట. అది భూమాతనా..? భూమేతనా..? ఇదివరకు కాంగ్రెస్ రాజ్యంల భూమేతనే ఉండె. మళ్ల వీఆర్వోలను తెస్తరట. పాస్ బుక్కులళ్ల మళ్ల 24 కాలమ్స్ పెడుతరట. ఇయ్యన్నీ ఆయనే చెప్తుండు. నేను చెప్తలేను. ధరిణిని తీసేస్తే రైతుబంధు ఎట్లొస్తది..? మళ్ల వీఆర్వోలు, ఎమ్మార్వోలు ఆపై అధికారులకు లంచాలు ఇయ్యాల్సిందేనా..? కాబట్టి కాంగ్రెస్కు ఓటేస్తే కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లయితది. అందుకే బాగా ఆలోచించి ఓటెయ్యాలె. బీఆర్ఎస్ గెలిస్తే ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతది. అద్భుతాలు జరుగుతయ్. కాంగ్రెస్ గెలిస్తే కథ మొదటికొస్తది. వాళ్లకు అసలు రాష్ట్రం గురించి అవగాహనేలేదు’ అని సీఎం ఎద్దేవా చేశారు.
‘మధిర ఆయకట్టుకు కృష్ణా నీళ్లు తక్కువ పడుతున్నయ్. పెద్దపెద్ద నాయకులున్నరు కాంగ్రెస్ల. ఒక్కడన్నా ఆలోచించిండా..? ఖమ్మం జిల్లాను ఒరుసుకుని గోదావరి పారుతది, దుమ్ముగూడెం దగ్గర లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రతిరోజూ పోతుంటయ్. ఆ నీళ్లను ఎత్తుకోవాలె, ఖమ్మంల పోసుకోవాలె అని ఎవడన్నా ఆలోచించిండా..? మేం ఆలోచించి సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తున్నం. దాదాపు అయిపోవచ్చింది. ఏడెనిమిది నెలల్లో పూర్తయితది. ఒక్కసారి 37 టీఎంసీ నీళ్ల సీతమ్మ సాగర్ పూర్తయితే మధిరలో కరువు అనేదే ఉండదు. మన దిక్కు కరువు మళ్లి గూడా చూడదు. 365 రోజులు నిండ నీళ్లే ఉంటయ్. కాబట్టి దయచేసి మంచి ప్రణాళికలతో ముందుకు పోయే బీఆర్ఎస్ను పోడగొట్టుకోవద్దు. ఈ పట్టిలేని భట్టి విక్రమార్కను గెలిపిస్తే వచ్చేదేమీ లేదు’ అని సీఎం అన్నారు.
‘రాష్ట్రంలో ఎలాగూ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే మీకు లాభం. నా మాటను గౌరవించి మీరు బీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజ్ గారిని గెలిపించండి. ఆయన సౌమ్యుడు, విద్యాధికుడు, మీ మధ్యనే ఉంటడు. మీకందరికీ తెలిసిన వ్యక్తి. ఆయనను గెలిపిస్తే మధిరను అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నా’ అని చెప్పారు.