హైదరాబాద్ : కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ వైఖరిని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తప్పుబట్టారు. ఏపీతో జల వివాదం నేపథ్యంలో నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతిభవన్లో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీ, నీటిపారుదలశాఖ ఇంజినీర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృష్ణా జలాల విషయంలో ఏపీ తీరును తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకుండానే ఏపీ ప్రాజెక్టులు కడుతోందన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. ఎన్టీటీ స్టే విధించినప్పటికీ అక్రమంగా నిర్మిస్తోందన్నారు.
ఏపీ చేపట్టిన పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక ప్రాజెక్టు అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ కూడా అక్రమ ప్రాజెక్టేనన్నారు. జులై 9న నిర్వహించబోయే కేఆర్ఎంబీ సమావేశాన్ని రద్దు చేయాలన్నారు. జులై 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలన్నారు. ఈ మేరకు తెలంగాణ ఎజెండాను కృష్ణానది యాజమాన్య బోర్డుకు పంపాలని అధికారులను ఆదేశించారు.
ఏపీ-తెలంగాణ మధ్య ఉన్న 66:34 నిష్పత్తిని తొలగించాలన్నారు. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలన్నారు. ఇరు రాష్ర్టాలకు మొత్తం 811 టీఎంసీల నికర జలాలు కేటాయింపు జరగాలన్నారు. తెలంగాణ, ఆంధ్ర చెరో 405.4 టీఎంసీలు వాడుకోవాలన్నారు. చెరోసగం నీటిని ట్రిబ్యునల్ కేటాయించేంత వరకు వాడుకోవాలని సూచించారు. నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాగాలన్నారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు కేఆర్ఎంబీకి లేదన్నారు. జల విద్యుత్పై ఇరు రాష్ర్టాలు నడుమ ఎలాంటి ఒప్పందాలు లేవన్నారు. విద్యుత్ ఉత్పత్తిపై కేఆర్ఎంబీ జోక్యం చేసుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కృష్ణా జలాలను వృథా చేస్తున్నామనే ఏపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పేర్కొన్నారు.