కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ కోసం ఎన్నో అడ్డంకులు వచ్చాయి. స్వార్థం లేకుండా కష్టపడి పనిచేసినం. నది లేకుండా ఒక ప్రాజెక్టు ఉన్నదంటే అది మానవ నిర్మితమైన మల్లన్నసాగర్ ఒక్కటే.
– మంత్రి హరీశ్రావు
Minister Harish rao | సిద్దిపేట, జూన్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరువు పాటలు పాడుకున్న బీడు బారిన నేలలో ఇవాళ కాళేశ్వరం జలాలు పుష్కలంగా పారుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేయడంతో కరువు పరారై సస్యశ్యామల తెలంగాణ రూపుదిద్దుకున్నదని అన్నారు. దశాబ్ది వేడుకల్ల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను సిద్దిపేట జిల్లా రంగనాయకసాగర్ ఒడ్డున బుధవారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు చంద్లాపూర్ లిఫ్ట్ట్ ఇరిగేషన్కు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ కోసం ఎన్నో రాజీలేని ప్రయత్నాలు చేశామని చెప్పారు. ఢిల్లీలో పర్యావరణ అనుమతి కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజులు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. ఆనాటి కష్టాల ఫలితమే ఇవాళ్టి గోదావరి నీటి సవ్వడి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆనాడు తాము పడిన కష్టం చూస్తే పుస్తకం రాయవచ్చన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ కోసం ఎన్నో అడ్డంకులు వచ్చాయని, స్వార్థం లేకుండా కష్టపడి పనిచేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. నది లేకుండా ఒక ప్రాజెక్టు దేశంలో ఉందంటే అది మానవ నిర్మితమైన మల్లన్నసాగర్ ఒక్కటేనని తెలిపారు. తెలంగాణ వచ్చాక బోరు మోటారు మరమ్మతు లేదు.. జనరేటర్ అవసరం లేని పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. పాలమూరు జిల్లాలో నాట్లు వేయడానికి ఇతర రాష్ర్టాల కూలీలు వస్తున్నారని ఇది తెలంగాణ సాధించిన ఘనత అన్నారు. నిరంతరం విద్యుత్తు, పుష్కలంగా సాగునీరు, మద్దతు ధరలు, ఎరువులు ఇలా రైతు జీవితం బంగారు మయమైందని తెలిపారు. చేపల ఉత్పత్తి పెరిగి గంగపుత్రుల దశ తిరిగిందని చెప్పారు.
రైస్మిల్లుల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. ఇది తెలంగాణ సాగునీటి ప్రగతికి తార్కాణమని పేర్కొన్నారు. సాగునీటి శాఖ అధికారులకు ప్రభుత్వం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నీటిరంగ ప్రగతికి దివంగత విద్యాసాగర్రావు చూపిన మార్గం చాలా గొప్పదని ప్రశంసించారు. దేశంలో అత్యధికంగా వరి ధాన్యం పండించే రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్, ఎస్ఈలు వేణు, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.