ఖమ్మం, జూలై 27: ఖమ్మం నగరంలోని మున్నేరు పరీవాహక ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గురువారం రాత్రి రక్షించాయి. కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్తో కలిసి రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అంతకుముందు మున్నేరు వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నట్టు తెలుసుకున్న సీఎం కేసీఆర్ భద్రాచలంలో ఉన్న మంత్రి పువ్వాడకు ఫోన్ చేసి వరద పరిస్థితిపై ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో మంత్రి వెంటనే ఖమ్మం చేరుకుని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
ఎన్డీఆర్ఎఫ్ కమాండర్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ నేతృత్వంలో విశాఖపట్నం నుంచి వచ్చిన ప్రత్యేక బృందం లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పద్మావతినగర్లోని ధ్యాన మందిరంలోని భవనంలో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ రెండు బృందాలుగా ఏర్పడి భవనం రెండో అంతస్తులో చిక్కుకున్న పలువురిని రక్షించాయి. బొక్కలగడ్డ వెంకటేశ్వరనగర్కు చెందిన 20 మందిని బయటకు తీసుకొచ్చాయి. తమను రక్షించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి పువ్వాడను, కలెక్టర్, సీపీలను కౌగిలించుకొని బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ‘జై పువ్వాడ’ అంటూ నినాదాలు చేశారు.