హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి రోజూ నాలుగు సభల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా గులాబీ దళపతి నేడు మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర్వహించనున్నారు. తొలుత మంచిర్యాలలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మంచిర్యాలకు చేరుకుంటారు. బీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు అనుకూలంగా ప్రచారం చేయనున్నారు. అనంతరం రామగుండం బయల్దేరుతారు.
మధ్యాహ్నం 2 గంటలకు రామగుండలోని గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగనున్న ప్రజా ఆశీర్వాసభకు హాజరవుతారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తరఫున ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు పక్కన తంగేడు మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి కలెక్టరేట్ సమీపంలో నిర్వహించనున్న సభకు హాజరవుతారు.