CM KCR | నల్లగొండ : కాంగ్రెస్ రాజ్యంలో అప్పులు ఉంటే, పన్నులు కట్టకపోతే దర్వాజాలు పీక్కపోయారు కానీ రైతుబంధు ఇవ్వాలనే ఆలోచన వారికి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. నల్లగొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కంచర్ల భూపాల్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
ఓటు మీ తల రాత రాస్తది. మీ భవిష్యత్ను నిర్ణయిస్తది. పనికిమాలిన వారికి వేస్తే మనకు పనికిమాలిన ప్రభుత్వమే వస్తది. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏర్పడుతది. మరి రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే మంచిగా ఉంటది. మరి రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే దీని భవిష్యత్ బాగుంటది. ఎవరు ఉంటే పేదల సంక్షేమం చూస్తరు. ఎవరు ఉంటే రైతుల గురించి తండ్లాడుతారు. మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ రాజ్యంలో అప్పులు ఉంటే, పన్నులు కట్టకపోతే దర్వాజాలు పీక్కపోయారు కానీ రైతుబంధు ఇవ్వాలని ఎవ్వడన్న ఆలోచన చేశారా..? ఆదుకున్నారా..? రైతుబంధు పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్కు అధికారం ఇస్తే మరి రైతుబంధు కూడా ఆగమైతది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే.. నేను ఇవాళ గ్యారెంటీగా చెబుతున్నా. తర్వాత నన్ను తప్పుపట్టుకోవద్దు. కరెంట్ కాట కలుస్తది గ్యారెంటీగా, ఎందుకంటే వారు చెబుతున్నారు. ఓడగొట్టుకుంటే మీదే తప్పు. మూడు గంటలే కరెంట్ ఇస్తామని చెబుతున్నారు. కర్ణాటకలో 20 గంటలని చెప్పి 5 గంటలు ఇస్తున్నారు. మరి ఐదు గంటల కరెంట్ కావాల్నా..? 24 గంటల కరెంట్ కావాల్నా..? మంచి క్వాలిటీ కరెంట్ కావాల్నా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.