CM KCR | నిజామాబాద్ : ఎన్నికలు రాగానే ఆగమాగం కాకుండా.. ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనను, 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనను బేరిజు వేసుకుని, ఆలోచించి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతుంది. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణితి రాలేదు. ప్రజాస్వామ్య పరిణితి చెందిన దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు. ఆలోచన చేయాలి. మంచేదో చెడేదో గుర్తించాలి. ప్రజలు గెలిచినప్పుడే వారి ఆకాంక్షలు నెరవేరుతాయి అని కేసీఆర్ అన్నారు.
ఈ రోజు బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన తర్వాత మీ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి వచ్చి పదేండ్ల నుంచి పరిపాలన చేస్తున్నాం. ఈ పదేండ్లలో ఏం జరిగింది..? 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది..? అనేది బేరీజు వేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో నిధులు, నీళ్లు లేవు. కరెంట్ లేదు. రైతులు, చైనేతల ఆత్మహత్యలు. వలసలు పోవుడు. చాలా భయంకరమైన బాధలు. మూడు నాలుగు నెలలు మెదడు కరగదీసి, ఒక ప్రణాళిక వేసుకున్నాం. చెట్టు ఒకడు, గుట్టకు ఒకడు ఉన్నాడు. ఇవన్నీ గమనించి పేదల సంక్షేమం కోసం చర్యలు తీసుకున్నాం కేసీఆర్ తెలిపారు.
వ్యవసాయ స్థీరికరణ జరగాలని రైతులను బాగు చేసుకున్నాం. రైతు బాగుంటే గ్రామం చల్లగా ఉంటుంది.. గ్రామం బాగుంటే దేశం చల్లగా ఉంటుందని రైతులను ఆదుకున్నాం. పెన్షన్ను 200 నుంచి రూ. 2 వేలకు పెంచుకున్నాం. సమాజానికి బాధ్యత వహిస్తున్న ప్రభుత్వమే వారిని కాపాడాలని అధికారులకు చెప్పాను. అప్పుడు లెక్కలేసి.. రూ. 600 సరిపోతది అన్నారు. ఈ పేదోళ్ల వద్దనే కొసరల్నా అని పెన్షన్ వెయ్యి చేసుకున్నాం. సంపద పెరుగుతున్న కొద్ది పెన్షన్లు పెంచుకుంటూ పోయాం. అంతే కాకుండా కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలు చేశాం అని కేసీఆర్ తెలిపారు.