CM KCR | దేవరకద్ర : కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంటూ పారే ఈ పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పాలమూరు జిల్లా ఒకప్పుడు పాలుగారిన జిల్లా. అద్భుతమైన జిల్లాను సమైక్య రాష్ట్రంలో ఘోరమైన గతి పట్టించారు. ఆనాడు ఉన్న సీఎంలు కూడా జిల్లాను దత్తత తీసుకున్నామని చెప్పి పునాది రాళ్లు వేశారు తప్ప.. కసికెడు నీళ్లు తెచ్చివ్వలేదు. పంటటలు ఎండిపోయి వలవల ఏడ్సి, బొంబాయి బతకపోయి చాలా వలసలు పోయి, చాలా బాధలు అనుభవించిన జిల్లా పాలమూరు. అలాంటి పాలమూరు జిల్లాను ఏ పార్టీ పట్టించుకున్నది..? మన గోస ఎవడైనా చూసిండా..? అన్నది ఆలోచించాలని కేసీఆర్ సూచించారు.
కృష్ణా, తుంగభద్ర నదులు ఒరుసుకుంటూ పారే జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టించే గతి పట్టించింది ఏ పార్టీనో ఆలోచించాలి. మహబూబ్నగర్ జిల్లా 50 ఏండ్ల పాటు చాలా కరువు అనుభవించింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రప్రదేశ్లో కలిసి మన ప్రాజెక్టులను సమైక్య పాలకులు రద్దు చేశారు. ఒకటే ఒక్క ప్రాజెక్టు అడగలేదు నాటి కాంగ్రెస్ నాయకులు. బచవాత్ ట్రిబ్యునల్ 1974లో నది నీళ్ల పంపకం చేస్తే ఏ మంత్రి, ఎమ్మెల్యే అడగలేదు. పాలమూరుకు నీళ్లు ఎన్ని కేటాయిస్తున్నారని ప్రశ్నించలేదు. ఇది రికార్డులో ఉంది.. రాజకీయం కోసం చెప్పట్లేదు. ఈ ప్రాంతం ఏపీలో కలకవపోతే చాలా బాగుపడుతుంటే.. నష్టపోయింది.. చారెడు నీళ్లు కావాలని అడిగేతోడు లేడు. మాకు వికారం అనిపిస్తుంది అని చెప్పి బచావత్ ట్రిబ్యునలే.. 17 టీఎంసీల సామర్థ్యం గల జూరాల ప్రాజెక్టు మంజూరు చేశారు. దాన్ని కట్టలేదు. మన తెలంగాణ బిడ్డ అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాకు శంకుస్థాపన చేస్తే ఆ ప్రాజెక్టు ముందరపడ్డది. అయినా నీళ్లు రాలేదు. కర్ణాటకకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా దుర్మార్గం చేసి, 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా కర్ణాటకు నష్టపరిహారం చెల్లించలేదు.. ఇక్కడ రైతాంగానికి నీళ్లు ఇవ్వలేదు. ఇది చరిత్ర నేను చెప్పేది సత్యం అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇంత అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్. పాలమూరును సర్వనాశనం చేసిన పార్టీ కాంగ్రెస్సే. మీ పెద్దలను అడిగినా ఇదే విషయం చెబుతారు. నేను చెప్పింది నిజమైతే ఆల వెంకటేశ్వర్ రెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపించాలి. నిజం కాకపోతే మమ్మల్ని ఓడించండి. 2004లో పొత్తు పెట్టుకుని మళ్లీ మోసం చేసింది. వైఎస్ మాటలు విని మన పార్టీని మోసం చేసింది కాంగ్రెస్. ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని మొండిపట్టుదలతో పోతే, 14 ఏండ్ల పోరాటం తర్వాత చివరకు దీక్ష పడితే దిగివచ్చి తెలంగాణ ప్రకటన చేశారు. మళ్లీ వెనక్కి వెళ్లారు. వందల మంది పిల్లల ప్రాణాలను బలిగొన్న తర్వాత, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడితే తప్పనిసరిస్థితుల్లో గతిలేక తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ అని కేసీఆర్ తెలిపారు.