CM KCR | నిర్మల్ : తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. మళ్లా పైరవీకారులు పుట్టుకొస్తరు.. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రైతుబంధుపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా మాట్లాడుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్. రైతులు అంతకుముందు ఏడ్చారు. లంచాలు ఇచ్చి ట్రాన్స్ఫార్మర్లు రిపేర్ చేయించుకున్న పరిస్థితి. ఇప్పుడు కరెంట్ను ఇచ్చుకున్నాం. నిర్మల్ నియోజకవర్గంలో 15 సబ్ స్టేషన్లు నిర్మించుకున్నారు. వందలాది ట్రాన్స్ఫార్మర్లు తెచ్చుకున్నారు. 24 గంటల కరెంట్తో పంటలు పండించుకుంటున్నారు అని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ రాక ముందు కరువులతో, వలసలతో సాగు,తాగునీటి గోసలతో చెట్టుకు గుట్టకు ఒకరయ్యాం అని కేసీఆర్ గుర్తు చేశారు. గ్రామాలు పచ్చబడాలంటే ఏం చేయాలని ఆలోచించి, వ్యవసాయాన్ని స్థీరికరించాలని నిర్ణయించాం. రైతుబంధు అనేది ఎలక్షన్ల కోసం పెట్టింది కాదు. నన్నెవరూ అడగలేదు. దరఖాస్తు పెట్టలేదు. ఎవరూ ధర్నా చేయలేదు. మా అంతట మేం ఆలోచించి ఆ స్కీం తెచ్చాం. నీటితిరువా రద్దు చేశాం. నీళ్లు, కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. రైతబంధు పెట్టుబడి కింద ఇస్తున్నాం. రైతులు పండించిన పంటను కొంటున్నాం నష్టం వచ్చినా కూడా. ఈ కార్యక్రమాల ద్వారా రైతుల ముఖాలు కళకళలాడుతున్నాయి. రైతుల రుణమాఫీ కూడా చేశాం. కొంతమందికి కావాల్సి ఉంది. కాంగ్రెసోళ్లు పిటిషన్ వేశారు. ఎన్నికలు ముగిసిన మర్నాడే ఇచ్చేస్తాం. ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చేస్తే వారం పది రోజుల్లో వచ్చేస్తది అని కేసీఆర్ పేర్కొన్నారు.
వ్యవసాయ స్థీరికరణ కోసం రైతుబంధు తెస్తే.. కేసీఆర్ పనిలేక దుబారా చేస్తున్నాడని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ బిచ్చమేస్తుండు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతులు బిచ్చగాళ్ల లాగా కనబడుతున్నారా..? రైతులు పండించే పంట ఎంత..? అందులో ఆయన తినేది ఎంత..? మిగతాది అంతా దేశానికే కదా ఇచ్చేది. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ బియ్యం పోతాయి కదా అని కేసీఆర్ తెలిపారు.
కరెంట్ 24 గంటలు అవసరం లేదు.. 3 గంటలు చాలని రేవంత్ రెడ్డి అంటున్నడని కేసీఆర్ తెలిపారు. ధరణి పోర్టల్ తెచ్చాం. ఎవరి కోసం, దేని కోసం తెచ్చాం. రైతుల భూములు క్షేమంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. నిశ్చితంగా ఉన్నారు రైతులు. ధరణి రాకముందు వీఆర్వో నుంచి సీసీఎల్ఏ దాకా రైతుల మీద పెత్తనం. ధరణి పోర్టల్ ఉంది కాబట్టి రైతుబంధు డబ్బులు నేరుగా వస్తున్నాయి. అదే విధంగా ధాన్యం అమ్మితే.. పైసలు నేరుగా మీ బ్యాంకులో పడుతున్నాయి. రైతుబీమా కూడా 10 రోజుల్లో జమ అవుతుంది. మరి ధరణి తీసేస్తే ఇవన్నీ ఎలా వస్తాయి. ఇప్పటిలాగా వస్తాయా..? మళ్లీ పహాని నఖలు, వీఆర్వోలు, ఎమ్మార్వో కార్యాలయాల చుట్టు తిరుగుడు. మళ్లీ పైరవీకారుల మందలు.. రైతుబంధు వస్తే నీ పేరు రాయాలంటే పంచ్ అజర్ లావో అంటడు. మళ్లీ పాతక కథనే రావాల్నా.. దళారీల రాజ్యమే రావాల్నా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
ధరణి ఉండాలని, 24 గంటల కరెంట్ కావాలని ప్రజలు అంటున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. పార్టీల చరిత్ర, నడవడి గురించి మీరు ఆలోచించాలి. గిరిజన బిడ్డలు ఉన్నారు. మా తండాలో మా రాజ్యం రావాలని కొట్లాడారు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. పట్టించుకోలేదు. కానీ మా గవర్నమెంట్లో ఆదివాసీ గూడెలను, గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం. అభివృద్ధి చేసుకుంటున్నారు. పోడు పట్టాలు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు.
అలవోకగా, తమాషాగా ఓటు వేయొద్దు.. ఆలోచన చేయాలి, చర్చ చేయాలి అని కేసీఆర్ సూచించారు. ఎవరు గెలిస్తే లాభమో ఆలోచించాలి. పొరపాటు కాంగ్రెస్ గెలిస్తే.. నేను తెలంగాణ బిడ్డగా చెప్తున్నా.. మీకు చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. వాళ్లకు రైతుబంధు మీద ఇష్టం లేదు. కరెంట్ ఇచ్చుడు ఇస్టం లేదు. రైతుల ఖాతాలో డైరెక్ట్గా డబ్బులు వేసుడు ఇష్టం లేదు. మళ్లా పైరవీకారులు పుట్టుకొస్తారు. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతది. జాగ్రత్తా అని మనవి చేస్తున్నా. ఈ అభివృద్ది కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ అభివృద్ది నిలకడగా ముందుకు పోతది అని కేసీఆర్ తేల్చిచెప్పారు.