నిర్మల్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): మనందరి సమష్టి కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, అద్భుత విజయాలను సొంతం చేసుకున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఆదివారం ఆయన నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొండాపూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డిని కుర్చీలో కూర్చోబెట్టి సత్కరించారు. అనంతరం నూతన సమీకృత కలెక్టరేట్కు చేరుకుని కలెక్టరేట్తోపాటు మెడికల్ కళాశాల, డబుల్డ్రూం ఇండ్లు, మైనార్టీ గురుకుల పాఠశాలల శిలాఫలకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
కలెక్టర్ వరుణ్రెడ్డిని తన చాంబర్లో కూర్చోబెట్టి అభినందించారు. అనంతరం ఆయా శాఖల జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. విసిరేసినట్టుగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించి ఎక్కడికక్కడ అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. నాలుగు వైద్య కళాశాలలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వర్థిల్లుతున్నదంటే ఎంతో ఆనందంగా ఉన్నదని అన్నారు. వెనుకబడిన ఆసిఫాబాద్ జిల్లాకు సైతం మెడికల్ కాలేజీ వచ్చిందంటే కేవలం తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకోవడం వల్లనే సాధ్యమైందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అలాగే ఉండి ఉంటే ఇంకా యాభై ఏండ్లు దాటినా ఈ అభివృద్ధి సాధ్యమయ్యేదికాదని స్పష్టంచేశారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతితో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందని పేర్కొన్నారు. ఆదిబాద్ జిల్లాలోని ముఖ్రా(కే) గ్రామం దేశవ్యాప్తంగా ఉన్న అనేక గ్రామాలతో పోటీపడి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నదని గుర్తుచేశారు.
ఇంకా సమాజంలో పేదరికం ఉన్నదని, తరతరాలుగా అణచివేతకు గురైన దళితజాతి, ఎన్నో బాధలు పడుతున్న గిరిజన జాతి వెనుబడి ఉన్నాయని, వెనుకడిన కులాల్లో కూడా చాలామంది నిరుపేదలు ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే కొన్ని వర్గాలకు అండగా నిలిచి ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటును అందించామని వివరించారు. అన్ని వర్గాల్లో ఉన్న పేదలను ఒక సమాన స్థాయిలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని స్పష్టంచేశారు. రాబోయే రోజుల్లో ప్రతి తాలూకా పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దీనివల్ల అనేకమంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్న భరోసా ఇచ్చారు. తెలంగాణ ఏర్పడకముందు సాగునీరందక, పంటలు పండక రైతులు నానా అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ తొమ్మిదేండ్లలో సాగునీరు, కరెంటు కష్టాలను అధిగమించి వ్యవసాయరంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని వివరించారు. కనీసం తాగునీరు అందని గ్రామాలకు స్వచ్ఛమైన నీటిని అందించగలిగామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉద్యోగులు మరింత కష్టపడి పేదరికాన్ని పూర్తిగా తరిమివేసి దేశంలోనే రాష్ట్రం అగ్రభాగంలో ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 24 నుంచి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్, అధికారులు సమన్వయంతో పనిచేసి చక్కని వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. పోడు పట్టాలు పొందినవారికి ఈ సీజన్ నుంచే రైతుబంధు సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్, జిల్లా కలెక్టర్ వరుణ్రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, విఠల్రెడ్డి, రేఖానాయక్, నడిపల్లి దివాకర్రావు, బాల్క సుమన్, ఆత్రం సక్కు, రాథోడ్ బాపూరావు, జడ్పీ చైర్మన్లు విజయలక్ష్మి, కోవ లక్ష్మి, రాథోడ్ జనార్దన్, ఎమ్మెల్సీ దండె విఠల్ తదితరులు పాల్గొన్నారు.
మానవీయ కోణంలో ప్రభుత్వం తీసుకున్న మంచి కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా అమలు చేయని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్నదని, దేశానికే రోల్మాడల్గా నిలిచిందని చెప్పారు. పల్లెల్లో ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులకు ఎక్కడాలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ఇటీవల మహారాష్ట్రకు వెళ్లినప్పుడు అక్కడి ప్రజలు తెలంగాణలో ఇన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నారా? అని ఆశ్చర్యపోయారని చెప్పారు. తెలంగాణ మాడల్ అనే మాట దేశమంతటా మార్మోగుతున్నదంటే ఉద్యోగుల కృషి వల్లనేనని ప్రశంసించారు. సమన్వయంతో పనిచేస్తున్న ప్రజాప్రతినిధులు, అంకితభావంతో పనిచేస్తున్న ఉద్యోగుల కృషి వల్లనే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు.