హైదరాబాద్, ఫిబ్రవరి 12 : రాష్ట్రంలో 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కాలన్న ఉద్దేశంతోనే జోనల్ విధానాన్ని తీసుకొచ్చినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలిసీ తెలియని కొందరు జోనల్ విధానం గురించి అర్థంకాక మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి, సర్వీస్ రూల్స్ను సరళీకరించాలని సీఎస్కు సూచించారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేస్తే రాష్ట్రం మరింత అద్భుతమైన ప్రగతి సాధిస్తుందని ఉద్భోదించారు. శనివారం భువనగిరి కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం సీఎం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..
అనుకున్నది సాధించినం..
ఒకనాడు మా ఉద్యోగాలు మాక్కావాలే అని నినదించాం. ఈ రోజు మనం సాధించిన ఘనత ఏందం టే.. కేంద్రం 7 నెలలు ఏడిపించినా, వాళ్ల వెంటపడి.. సంఝాయించి.. ప్రభుత్వ ఉద్యోగాల్లో 95% స్థానికులకే దక్కాలని రిజర్వేషన్ పెట్టించుకొని వచ్చినం. ఇవ్వాళ 95% ప్రభుత్వ ఉద్యోగాలు కచ్చితంగా తెలంగాణ బిడ్డలకే వస్తాయి. గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలను కూడా స్టేట్ లెవల్ అని పెట్టకుండా, చిన్న టెక్నిక్తో మల్టీజోనల్ పోస్టు అని పెట్టినం. ఈ రోజు గెజిటెడ్ ఆఫీసర్ పోస్టు కావొచ్చు. జోనల్ పోస్టు కావొచ్చు.. 95% తెలంగాణ బిడ్డలకే వస్తాయి. ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ను సరళీకరించాలి. ఉద్యోగులందరినీ నేను కోరేది ఒక్కటే.. ఇప్పుడు మీరు చేస్తున్న కృషిని కొనసాగించండి. అన్ని రంగాల్లోనూ ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధిస్తున్నాం. మంచి ప్రజాప్రతినిధులు, మంచి అధికారులు, మంచి సీఎస్ కలిసి కృషి చేస్తే ఇలాంటి అద్భు త ఫలితాలు వస్తాయి. ఉద్యోగుల కృషితోనే అద్భుతమైన ఎకో తెలంగాణలో బిల్డ్ అయ్యింది. దేశమేమో ఒకపక్క కిందికి పోతుంటే తెలంగాణ పెరుగుతున్నది.
యావత్ దేశం మన నుంచి నేర్చుకుంటున్నది
ఇవ్వాళ ప్రతి గ్రామంలో వైకుంఠధామం, కామన్ డంప్యార్డ్, ప్రతి ఇంటికీ నల్లా ఉన్నాయి. ఇవన్నీ ఉద్యోగుల కృషి ఫలితమే. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్ ఉంటుందని ఎప్పుడైనా ఊహించామా? రోజూ చెత్త ఊడుస్తరని ఊహించినమా? మన పల్లెలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆల్ ఇండియాస్థాయి టీంల వాళ్లు వచ్చి నన్ను అడిగారు.. ఏ గ్రామాలు పరిశీలించాలి అని. ఏ ఊరుకు వెళ్లినా ఒకే రీతిన ఉంటాయి. మీ ఇష్టం ఉన్న గ్రామంలో పరిశీలించుకోండి అని చెప్పిన. ఆ కృషి ఇంకాస్త కొనసాగిస్తే జపాన్లో అట్లా ఉంటదట.. అమెరికాలో ఇట్ల ఉంటదట.. అని వినే పరిస్థితి పోయి.. మనమే ఉదాహరణ కావాలి.
ఉద్యోగుల జీతాలు మరింత పెరుగుతయ్
ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటే దానిని అధికారులు అంతే పకడ్బందీగా అమలు చేస్తున్నరు. అందుకు 2,600 రైతువేదికలను స్వల్పకాలంలో నిర్మించడమే ఉదాహరణ. అందుకు సీఎస్ సోమేశ్కుమార్కు కృతజ్ఞతలు చెప్తున్నా. ఉద్యమ నేతగా నాడు చెప్పినట్టుగానే కేంద్ర ఉద్యోగుల కంటే అధిక వేతనాలను రాష్ట్ర ఉద్యోగులకు ఇస్తున్నం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఇంకా పెరుగుతయ్. సంపదలో అందరూ భాగస్వాములే. రాష్ట్రం ఆ దిశగానే పురోగమిస్తున్నది. గొప్ప ధనిక రాష్ట్రంగా ఎదుగుతున్నది. గొప్పగా పనిచేసే విధానం నుంచే, ఓపిక నుంచే సంపద వస్తుంది. మంచి ఆలోచనలు వస్తయ్. ధైర్యం వస్తది. అడుగు ముందుకు వేస్తం. అప్పుడే ప్రజలందరూ చల్లగా ఉంటరు. అదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది. ఒక గుణాత్మకమైన మార్పునకు ప్రగతిశీల విధానంలో కరెక్టుగా పనులు సాగుతున్నయ్.
ఫ్రీ ఆఫ్ కరప్షన్.. ఫ్రీ ఆఫ్ హరాస్మెంట్
రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నయి. సమాజం మంచిగ ఉన్నది. పరస్పరం గౌరవించుకుంటం. గొప్ప కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నది అనే ఒక సామరస్య పూర్వకమైన వాతావరణ వలయం ఏర్పడింది. మన దగ్గర సేఫ్ ఇన్వెస్టిమెంట్ ఉన్నది కాబట్టే మన దగ్గర పెట్టుబడి పెట్టేవాళ్లు, రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్లు.. ఇట్లా అనేక రకాల వాళ్లు వస్తున్నరు. ఫ్రీ ఆఫ్ కరప్షన్.. ఫ్రీ ఆఫ్ హరాస్మెంట్ ఉన్నది కాబట్టి పెట్టుబడులు వస్తున్నాయి. మన గురించి బయట సానుకూల వాతావరణం ఏర్పడటం వల్లే ఈ మార్పు సాధ్యమైంది.
దేశంలో అత్యధిక గొర్రెలున్న రాష్ట్రం మనదే..
నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టిన. రోజుకు 16 వేల గొర్రెలు దిగుమతి చేసుకుంటున్నం అని చెప్పారు. మన దగ్గర 30 లక్షల మంది యాదవుల జనాభా ఉన్నది. గొర్రెలను దిగుమతి చేసుకోవడం సిగ్గుచేటు అని అన్నా. ఈ విషయం మాకు ఎవ్వరు చెప్పలేదు సార్.. అని అన్నరు. ఈ రోజు మనం రాజస్థాన్ను తలదన్ని ఇండియాలోనే గొర్రెలు పెంచే నంబర్ వన్ రాష్ట్రం అనే స్థాయికి వచ్చాం. ఇదంతా అధికారులు, కలెక్టర్లు కలిసి టీం వర్క్ చేయడం వల్లే సాధ్యమైంది. భువనగిరి జిల్లాలోనే 12 లక్షల యూనిట్ల గొర్రెలు పంచుకున్నాం అని మంత్రి జగదీశ్వర్రెడ్డి చెప్తున్నారు. మా ప్రజలకు సేవచేయాలన్న ద్విగుణీకృత ఉత్సాహంతో, మా ఊళ్లను మేం బాగు చేసుకోవాలన్న తపనతోటి ఇది సాధ్యమైంది.