కల్లాల్లో వానొస్తే పంటంతా నీళ్ల పాలు.. మార్కెట్కు పోవాలంటే రవాణా తిప్పలు..తరుగు పోతుందేమోనన్న భయాలు..మద్దతు ధర దక్కుతదో, లేదోనన్న బుగులు..రైతు పంట పండించటం ఒకెత్తు.. అమ్మేదాకా కాపాడుకోవటం ఇంకో ఎత్తు..
ఈ తిప్పలు తప్పించేలా విప్లవాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ్రీకారం చుట్టారు. పండించిన పంటకు లాభాలు అందించేలా ‘రైతు వద్దకే రైస్మిల్లు’ను తీసుకురావాలని నిర్ణయించారు. రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకొంటున్న ఈ శుభసమయాన సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఏ కారణం చేతనైనా పండిన పంట వ్యర్థం కాకుండా, తరుగు లేకుండా, రైతులకు ధర తగ్గడం వంటి నష్టాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. రైతు పంటకు ఓపెన్ మార్కెట్ రేట్ ధర పలికేలా చేయడానికి వరిధాన్యాన్ని పలు రకాల ఉత్పత్తులుగా మార్చే దిశగా జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో గంటకు 60 టన్నులు, 120 టన్నుల బియ్యాన్ని ఆడించే అత్యాధునిక రైస్మిల్లులను ఏర్పాటు చేయనున్నాం.
– సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): అన్నదాతల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకొన్నది. వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నది. ఇందులో భాగంగా రైతుల వద్దకే రైస్ మిల్లులు రానున్నాయి. జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని, పంట ఉత్పతులు విశ్వవిపణిలో అమ్ముకొని లాభాలు ఆర్జించే స్థాయికి రైతన్నను చేరుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం వరిధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసే జపాన్కు చెందిన సటేక్ కార్పొరేషన్ కంపెనీ ప్రతినిధులతో సచివాలయంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘వ్యవసాయాన్ని పండుగ చేయాలనే దార్శనికతతో సాగునీరు, విద్యుత్తు, రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి అంశాలను ప్రాధాన్య అంశాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను అమలుచేస్తూ ఉచిత విద్యుత్తును, సాగునీటిని అందిస్తూ, సబ్సిడీలిస్తూ రైతులను పంటలు పండించేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఏ కారణం చేతనైనా పండిన పంట వ్యర్థం కాకుండా, తరుగు లేకుండా, రైతులకు ధర తగ్గడం వంటి నష్టాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
రైతు పంటకు ఓపెన్ మార్కెట్ ధర పలికేలా చేయడానికి వరిధాన్యాన్ని పలు రకాల ఉత్పత్తులుగా మార్చే దిశగా జిల్లాలవారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రతి జిల్లాలో గంటకు 60 టన్నులు, 120 టన్నులు బియ్యాన్ని ఆడించే ఆధునిక సాంకేతికతో కూడిన రైస్ మిల్లులను ఏర్పాటు చేయనున్నాం’ అని వెల్లడించారు. ‘పంజాబ్ వంటి రాష్ర్టాలను వెనక్కి నెట్టి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 3 కోట్లకు పైగా టన్నులకు చేరుకోవటం వెనుక ఎంతో కృషి దాగి ఉన్నది. మరికొద్ది రోజుల్లో పాలమూరు జిల్లాలోని పాలమూరు ఎత్తిపోతల, నల్లగొండ జిల్లా బ్రాహ్మణవెల్లెంల, డిండి, సిద్దిపేటలోని గౌరవవెల్లి, ఖమ్మం జిల్లా సీతారామ, సిరిసిల్ల మల్కపేట, అచ్చంపేట ఉమామహేశ్వర వంటి ప్రాజెక్టులు పూర్తి కానున్నాయి. వరి ధాన్యం దిగుబడి మరింతగా పెరుగనున్నది. వరి ధాన్యపు మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో రైస్మిల్లుల సామర్థ్యం 75 లక్షల టన్నులకు మించి లేదు. ధాన్యాన్ని మిల్లాడించే పరిస్థితి డిమాండ్కు తగ్గట్టు లేకపోవడం వల్ల రైతులు ఇబ్బందిపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. వీటి నుంచి రైతును గట్టెక్కించడానికి ఈ నిర్ణయం తీసుకొన్నాం’ అని చెప్పారు.
యూనిట్ల ఏర్పాటుకు రూ.2 వేల కోట్లు
తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగి, దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, వారు పండించిన పంటకు లాభాలను ఆర్జించి పెట్టే మార్కెటింగ్ విధానాలను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. దీనికి త్వరలోనే సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. రైస్మిల్లులకు అనుసంధానంగా గోదాములు, రైస్బ్రాన్ ఆయిల్ ఉత్పత్తి చేసే మిల్లులను కూడా ఏర్పాటు చేయనున్నారు. సీఎం అధ్యక్షతన జరిగిన సమీక్షలో.. సివిల్ సైప్లె కార్పొరేషన్ ఆధ్వర్యంలో రైస్మిల్లుల ఏర్పాటు, నిర్వహణ, మార్కెట్ విస్తరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు మేలు జరిగేలా మరిన్ని నిర్దిష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. పౌరసరఫరాల కార్పొరేషన్లో సిబ్బందిని పెంచుకోవాలని సూచించారు. సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ రవీందర్సింగ్, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.