కుటుంబంలో అర్హులకు తగిన ఉద్యోగం
బాధితులకు అండగా నిలిచిన కేసీఆర్
కేంద్రం వల్లే రాకేశ్ బలయ్యాడని ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సైన్యం, సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎం అండగా నిలిచారు. రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాతోపాటు, ఆయన కుటుంబంలో అర్హులైనవారికి తగిన ప్రభుత్వోద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల వల్లనే రాకేశ్ బలైపోయాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సైనికులపై, వారి కుటుంబాల పట్ల ముఖ్యమంత్రి అవ్యాజమైన అభిమానాన్ని చాటుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గల్వాన్ లోయలో చైనా కుట్రకు బలైపోయిన కర్నల్ సంతోష్బాబు కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా.. ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే అంతేకాకుండా గల్వాన్ లోయలో అమరులైన ఇతర రాష్ర్టాల జవాన్ల కుటుంబాలను సైతం ఆదుకొన్నారు. స్వయంగా జార్ఖండ్, చండీగఢ్ ప్రాంతాలకు వెళ్లి.. అమరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. అమర జవాన్ల కుటుంబాలకు ఇతర రాష్ర్టాలూ సహాయం చేశాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మా త్రం భావోద్వేగ నినాదాలు ఇవ్వడం తప్ప ఆర్థికంగా, హార్థికంగా అమరజవాన్ల కుటుంబాలను ఆదుకొన్నది లేదు. సాధారణంగా సైనిక విధానాల ప్రకారం వారికి హక్కుగా రావలసినవి వచ్చాయే తప్ప మోదీ సర్కారు పైసా సాయం చేసింది లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పూనుకొని.. దేశ సరిహద్దుల్లో మనకు రక్షణగా నిలిచే జవాన్ల కుటుంబాలకు కుటుంబపెద్దగా నిలిచి తన ఔదార్యాన్ని చాటుకొన్నారు.
దబీర్పేటలో రాకేశ్ తల్లికి నీళ్లు తాగిస్తున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి, ఇన్ సెట్లో మృతుడు రాకేశ్ ఫైల్ ఫోటో