హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి కేటాయిస్తూ రెవెన్యూశాఖ (డిజాస్టర్ మేనేజ్మెంట్) కార్యదర్శి రాహుల్ బొజ్జా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేయనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. కౌలు రైతులకు సైతం ఈ సాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం గ్రామాల వారీగా పంట నష్టం వివరాలు అందజేయాలని వ్యవసాయశాఖ కమిషనర్కు సూచించారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 2.28 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులకు పరిహారం కోసం రూ.228 కోట్లు అవసరం కానున్నాయి. ఈ నిధులను వెంటనే విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో వారం, పది రోజుల్లోనే వాటిని రైతులకు అందించేందుకు వ్యవసాయశాఖ చర్యలు ప్రారంభించింది. గ్రామాల వారీగా, రైతుల వారీగా పంట నష్టం వివరాలను నమోదుచేయాలని ఇప్పటికే ఏఈవోలకు ఆదేశాలు జారీచేసింది. రెండు మూడు రోజుల్లో పూర్తి సమాచారాన్ని సేకరించి పరిహారం అందించనున్నారు. తక్కువ నష్టం జరిగిన జిల్లాల్లో రైతులకు ముందుగానే పరిహారం నిధులు అందనున్నాయి.
కేంద్ర ప్రభుత్వంలో భాగమైన జాతీయ విపత్తుల సహాయ నిధి (ఎన్డీఆర్ఎఫ్) నిబంధనల ప్రకారం రైతులకు కేవలం ఎకరానికి రూ.3,333 పరిహారం మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు రూ.10 వేల పరిహారాన్ని ప్రకటించారు. కేంద్రం నిబంధనల ప్రకారం పంట 33 శాతానికి పైగా నష్టపోతేనే పరిహారం అందించాలి. లేనిపక్షంలో రైతుకు ఎలాంటి పరిహారం ఉండదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ విధంగా కాకుండా మానవతా దృక్పథంతో పరిహారం అందిస్తున్నది.
దేశంలోని అనేక రాష్ర్టాల్లో చాలాసార్లు వరదలొచ్చాయి. పంటలు నష్టపోయాయి. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మాదిరిగా రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్ట పరిహారం అందించలేదు. రైతులకు అధిక నష్ట పరిహారం అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది అద్దం పడుతున్నది. రైతులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని మరోసారి భరోసా ఇచ్చినట్టయ్యింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తూ రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు వంటి పథకాలను అమలు చేయడంతోపాటు కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను నిర్మించింది.
నేను నాకున్న భూమితోపాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని మక్కలు సాగు చేశాను. ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాను. అకాల వర్షం కారణంగా పంట నేల వాలింది. తీరని బాధలో ఉన్న మాకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తానని ప్రకటించి భరోసా ఇచ్చారు. పంట నష్టాన్ని చూసి కేసీఆర్ చలించిపోయారు. సాధారణ రైతులకే కాకుండా కౌలు రైతులకూ పరిహారం ఇస్తామని ప్రకటించడం ఆనందాన్నిచ్చింది.
– వట్టికొండ రామకృష్ణ, రైతు, రావినూతల, బోనకల్లు మండలం, ఖమ్మం జిల్లా
నేను 18 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాను. దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో రెండో పంటగా మక్కజొన్న వేశాను. పంటను వరద ముంచింది. గత ప్రభుత్వాలు పంట నష్ట పరిహారం ఎకరాకు కేవలం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకే ఇచ్చేవి. సీఎం కేసీఆర్ స్వయంగా పంటలను పరిశీలించి ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తాననడం ఊరటనిచ్చింది. గతంలో ఏ ప్రభుత్వమూ రైతులకు సక్రమంగా పంట నష్టానికి సంబంధించిన పరిహారం ఇవ్వలేదు. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా కేసీఆర్ మెరుగైన పరిహారం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
– కొచ్చర్ల కృష్ణ, రైతు, గార్లపాడు, బోనకల్లు, మండలం, ఖమ్మం జిల్లా