ఖమ్మం కమాన్బజార్, ఆగస్టు 15: భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగంచేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్)లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ తాతా మధు జాతీయజెండాను ఆవిషరించి, జాతీయగీతాన్ని ఆలపించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను భవిష్యత్ తరాలకు అందిస్తూ, దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతిఒకరూ తమవంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమాన్ని ముందుండి నడిపించి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పగడాల నరేందర్, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి, మాజీ కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, మగ్బుల్, శీలంశెట్టి వీరభద్రం, రమా, షకీనా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.