తొర్రూరు, నవంబర్ 25: ‘కేసీఆర్ తిరుగులేని సీఎం.. నా 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇన్ని మంచి పనులు చేసే ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా అమలు చేయని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చి అన్నదాతకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ మన తెలంగాణకు దొరకడం గర్వకారణం’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మహబూబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం నాంచారిమడూరు గ్రామంలో శుక్రవారం బీసీల కోసం నిర్మించిన 30 డబుల్ బెడ్రూం ఇండ్లను జిల్లా కలెక్టర్ శశాంకతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనైనా రూ.2,016 పెన్షన్, 24 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్తు, ఏటా రెండు దఫాలుగా ఎకరాకు రూ.10 వేల రైతు బంధు, రూ.5 లక్షల బీమా, కల్యాణ లక్ష్మి ఇస్తున్నాయా? అన్న విషయంపై ప్రజలు, లబ్ధిదారులు నిండు మనస్సుతో ఆలోచించాలని కోరారు. కొంతమంది పనిగట్టుకుని ప్రభుత్వ పథకాలు పొంది కూడా ఏమిచ్చారంటూ మాట్లాడితే వారికి లబ్ధిదారులే తగిన రీతిలో సమాధానం చెబుతారని పేర్కొన్నారు.
కేసీఆర్కు బాసటగా నిలవాలి
మార్కెట్ ప్రకారం ఒక్కో డబుల్ బెడ్రూం ఇండ్ల విలువ రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షలు ఉన్నదని, వీటిని ప్రభుత్వం ఒక్కో లబ్ధ్దిదారుడికి ఉచితంగా ఇస్తున్నదని చెప్పారు. ఇన్ని మంచి పనులు చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని కోరారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పాలకుర్తి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించామని, రూ.150 కోట్లు ఖర్చు పెట్టి 4,481 ఇండ్లు కడుతున్నామని, కొన్ని చోట్ల లబ్ధిదారులకు అందజేశామని పేర్కొన్నారు. సొంత స్థలం ఉన్న వారికి ఇంటిని నిర్మించుకునేందుకు రూ.3 లక్షలు చెల్లించేందుకు మార్గదర్శకాలు జారీ చేయగానే, నాంచారిమడూరుకు అదనంగా 50 ఇండ్లు ఇస్తానని హామీ ఇచ్చిన విషయం గుర్తుచేశారు.
పొరుగు రాష్ర్టాల్లో రూ.1,400కు క్వింటా దొడ్డు వడ్లు కొంటుంటే మన రాష్ట్రంలో రైతు నష్టపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి క్వింటాకు రూ.2,060 చెల్లించి కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. ఛత్తీస్గఢ్ రైతులు దొడ్డిదారిన ఏటూరునాగారానికి ధాన్యం తెచ్చి అమ్ముతున్నారని పేర్కొన్నారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మీటర్లు పెట్టనివ్వనని కేసీఆర్ తేల్చి చెప్పారని, ఇలాంటి సీఎంను రైతులు కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలన్నారు. కాగా, గోపాలగిరిలో త్వరలో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.