బీసీలు వెనుకబడ్డవారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ రోజు హైదరాబాద్ రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నిర్వహించిన సాంస్క్రుతిక నృత్య పోటీల్లో గెలిచిన విధ్యార్థులకు సహచర మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన అవార్డులు అందజేసారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో రాష్ట్రంలో విద్యా, ఉపాధి రంగాలతో పాటు సాంస్కృతిక కళారంగంలో బీసీ విద్యార్థులు ముందంజలో ఉన్నారన్నారు. విద్యార్థుల్లో దాగిన ప్రతిభను గుర్తించి వారిని నాసా వరకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 19 గురుకులాలు ఉంటే నేడు 281కి పెంచుకున్నామని, వీటికి అదనంగా బీసీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 700 హాస్టళ్లను అత్యుత్తమ నాణ్యతతో కూడిన బోజన, వసతులతో నిర్వహిస్తున్నామని చెప్పారు.
420 ఫ్రీ మెట్రిక్ హాస్టళ్లు, 280 పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో 46,457 మంది ఉంటున్నారని వీరిలో విద్యతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, క్రియేటివ్ థింకింగ్, కెపాసిటీ బిల్డింగ్, అంతర్గత నైపుణ్యాల్ని వెలికితీసి ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు వారి సర్వతోముఖాబివృద్ది కోసం చరిత్రలోనే తొలిసారిగా సాంస్కృతిక పోటీలు నిర్వహించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. గత రెండు నెలలుగా సమ్మర్ కార్నివాల్ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా తరగతులతో పాటు పోటీల్ని నిర్వహించామని, రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న టీముల్లో గెలిచిన వారిని అభినందించారు.
ఎంజేపీ స్కూళ్లలోని విద్యార్థులు విద్యతో పాటు గతంలో సెయిలింగ్ ఇతర రక్షణ క్రీడల్లో జాతీయ స్థాయి పతకాలు సాధించారని, ఇప్పుడు హాస్టల్ విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని జాతీయ స్థాయి పోటీలతో పాటు ఆటా, తానా, టీడీఎఫ్ వంటి సంస్థలు నిర్వహించే అంతర్జాతీయ పోటీలకు సైతం పంపుతామన్నారు. ప్రతీ ఏడు సాంస్కృతిక పోటీలతో పాటు ఆటల పోటీలను కూడా నిర్వహిస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
బీసీలకు వేల కోట్ల రూపాయలను పీజు రియంబర్స్మెంట్, స్కాలర్ షిప్పుల రూపంలో అందజేస్తున్నారని, వెనుకబడిన బిడ్డలు సైతం సగర్వంగా తలెత్తుకొని విదేశీ విశ్వవిద్యాలయాల్లో చదువుకొనేలా మహాత్మా జ్యోతీబాపూలే పేరుమీద నైపుణ్యం కలిగిన ఒక్కో బీసీ విద్యార్థికి ఇరవై లక్షల రూపాయలు అందజేస్తున్నారని తెలిపారు. ఒకేసారి 80వేల ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయడమే కాకుండా బీసీలకు వయోపరిమితి సడలింపులిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
అలాగే అత్యుత్తమ శిక్షణ అందించేందుకు బీసీ స్టడీ సర్కిళ్లు కృషి చేస్తున్నాయని, ఇప్పటికే గ్రూప్ 1 కోచింగ్ ప్రారంభించామని, ఎస్సై, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాల కోసం నియోజకవర్గానికి ఒక స్టడీ సెంటర్ని ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. దాదాపు లక్షమందికి పైగా అభ్యర్థులకు అత్యుత్తమ కోచింగ్ ఇస్తున్నామన్నారు. ఇందుకోసం ఎన్ని నిధులైనా వెచ్చించి బీసీ బిడ్డల్ని ప్రభుత్వోద్యోగులుగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి గంగుల కమలాకర్.
ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ.. అవకాశం ఇస్తే ఏం రంగం లోనైనా రాణిస్తారు అని బీసీ విద్యార్థులు మరోసారి రుజువు చేశారని సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకటేశం అన్నారు. బీసీ హాస్టళ్ల చరిత్రలోనే మొదటి సారి విద్యార్థుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారిలో దాగిన కళాతృష్ణను బయటీకి తీసుకురావడానికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని ఆయన అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసి సంక్షేమ హాస్టల్స్లో శిక్షణ ఇచ్చి జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి వారిలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ గ్రూప్లతో రాష్ట్ర స్థాయిలో గ్రాండ్ ఫినాలే ఏర్పాటుచేశామన్నారు. అద్భుతమైన ప్రతిభ పిల్లల్లో దాగి ఉందని ఈ ప్రదర్శనల ద్వారా మరోసారి నిరూపితమైందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, సభ్యులు కిషోర్ కుమార్ గౌడ్, ఉపేంద్ర, ఎమ్మెల్సీ లు మనుషులేనా చారి, రఘోత్తమ రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, బీసీ సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాదికారులు పాల్గొన్నారు.