జగిత్యాల, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధి, పునర్నిర్మాణాన్ని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్, అందుకు అనుగుణంగా అధికారులను సమాయత్తం చేశారు. బుధవారం కొండగట్టు చేరుకొన్న ఆయన, అక్కడ మూడున్నర గంటలకుపైగా గడిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.40 గంటల వరకు ఇక్కడే ఉండి ఆమూలాగ్రం పరిశీలించారు. 11.03 గంటలకు హెలికాప్టర్లో కొండగట్టు ప్రాంతానికి చేరుకొని, పది నిమిషాల పాటు ఏరియల్ వ్యూ ద్వారా అంజన్న క్షేత్ర పరిసరాలను పరిశీలించారు. తర్వాత నాచుపల్లి జేఎన్టీయూ హెలిప్యాడ్లో దిగారు. మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్తోపాటు ఎమ్మెల్యేలు, అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. 11.20 గంటలకు ప్రగతిరథం ద్వారా రోడ్డుమార్గాన గుట్టపై ఉన్న ఈవో కార్యాలయం వద్దకు సీఎం చేరుకొన్నారు. అక్కడి నుంచి కాలినడకన ఆలయానికి వెళ్లారు. అర్చకులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం పలికారు. సీఎం ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకుల ఆశీర్వాదం తీసుకొన్న తర్వాత పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్నం 12.05 గంటలకు ఆలయం పక్కన ఉన్న సమావేశ మందిరానికి వెళ్లారు. కొండగట్టు ఆలయ అభివృద్ధి, పునర్నిర్మాణంపై అధికారులు, ప్రజాప్రతినిధులు, వాస్తు, ఆగమ శాస్త్ర నిపుణులు, అర్చకులతో రెండు గంటలకుపైగా సమీక్ష సమావేశం నిర్వహించారు. 2.40 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు.
అత్యంత మహిమాన్వితమైన హనుమాన్ ఆలయాల్లో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఒకటి. ప్రకృతి రమణీయ ప్రదేశాల మధ్యన ఉన్న ఈ దేవస్థానానికి 400 ఏండ్ల చరిత్ర ఉన్నది. కొండపైన ఆంజనేయ స్వామి ఆలయంతోపాటు అమ్మవారు, వేంకటేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఈ క్షేత్రానికి భేతాళస్వామి క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. ఇక్కడ మునీశ్వరుల గుట్టలు దర్శనమిస్తాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరులో ఎండకాలం కూడా నీళ్లు కనిపిస్తాయి. కొండపైన కొండలరాయుడి గుర్రపుడెక్కల ఆనవాళ్లు ఉన్నాయి. కొండ చుట్టూ పరుచుకున్న అడవుల్లో హిమాలయాల్లో కనిపించే కొన్ని అరుదైన వృక్షజాతులు పెరుగుతున్నాయి. అందులో చాలా వరకు వైద్యంలో వాడే వనమూలికలే. కొండపై నుంచి చూస్తే పచ్చదనం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
ఉత్తర తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా, భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్న ఆలయాల్లో ఒకటైన కొండగట్టు అంజన్న క్షేత్రానికి నిత్యం రద్దీ ఉంటుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల తాకిడి ఉంటుంది. నిత్యం ఐదువేల మంది దర్శించుకొంటుండగా, మంగళ, శనివారాల్లో సగటున పది నుంచి 12 వేల మంది వస్తుంటారు. నెలకు 1.50 లక్షల నుంచి 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకొంటారని అంచనా. శ్రావణంలో అయితే దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది వస్తుంటారు. హనుమాన్ చిన్న, పెద్ద జయంతి ఉత్సవాల సమయంలో లక్షల మంది దీక్షాపరులు వచ్చి మాల విరమణ చేస్తారు. ఏటా 18 నుంచి 20 లక్షల మంది దర్శించుకుంటుండగా, రూ.10 కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నదని ఆలయ అధికారులు చెప్తున్నారు.