CM KCR | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మరణం పట్ల సీఎం కే చంద్రశేఖర్రావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వారి మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దికును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధారిత దేశంలో మెజారిటీ ప్రజల జీవనాధారం, దేశ ప్రజల సాంస్కృతిక జీవన విధానం వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్నదనే దార్శనికతతో, సంప్రదాయ పద్ధతిలో సాగుతున్న వ్యవసాయాన్ని స్వామినాథన్ వినూత్న పద్ధతుల్లో గుణాత్మక దశకు చేర్చారని పేర్కొన్నారు. స్వామినాథన్ కృషితోనే ఆహారాభివృద్ధిలో భారత్ స్వయంసమృద్ధి సాధించిందన్నారు. వరి, గోధుమ తదితర పంటలపై చేసిన అద్భుతమైన ప్రయోగాలతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి, హరిత విప్లవాన్ని సాధించిందని తెలిపారు. స్వామినాథన్ పరిశోధనలు, సిఫారసులు విప్లవాత్మక మార్పులకు నాంది పలికాయన్నారు.
తెలంగాణలో వ్యవసాయ రంగాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణను స్వామినాథన్ కొనియాడిన విషయాలు, తనతో వారికున్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో స్వామినాథన్ రాష్ర్టానికి రావడం, వారితో తాను సమావేశం కావడం మరిచిపోలేనని సీఎం పేర్కొన్నారు. ఆ సందర్భంగా ఆయన చేసిన సూచనలు అమూల్యమైనవని తెలిపారు. ఉచిత విద్యుత్, ఎత్తిపోతలతో సాగునీటి రంగాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను ఆయన ఎంతో ప్రశంసించారని సీఎం గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో రైతు సంక్షేమం, వ్యవసాయ రంగాభివృద్ధి గురించి తెలుసుకున్న విశ్వనాథన్ తెలంగాణను సందర్శించడానికి ఆసక్తి కనబరిచేవారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్ వారి ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.