హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ రాజధాని ప్రాంత సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైసీపీ, బీజేడీ మద్దతు తెలుపడంతో పెద్దల సభలో ఈ బిల్లు గట్టెక్కింది. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఓటు వేయగా, వ్యతిరేకంగా 102 మంది ఓటు వేశారు. అంతకుముందు రాజ్యసభలో జరిగిన చర్చలో బీఆర్ఎస్తోపాటు ఇతర విపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తూర్పారబట్టాయి. అయితే దేశ రాజధానిలో అవినీతి రహిత, సమర్థ పాలన కోసమే ఈ బిల్లును తెచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పేర్కొన్నారు.
ప్రభుత్వ హక్కులను కాలరాయడమే
బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు తూర్పారబట్టారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలు చేసే పార్లమెంట్కు కూడా కొన్ని పరిమితులు, పరిధులు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. సోమవారం ఢిల్లీ సర్వీసుల బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో కేశవరావు మాట్లాడారు. ఈ బిల్లు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకమన్నారు. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడి ఉంటే ఆయనపై చర్యలు తీసుకోవాలని.. కానీ ఆయన ప్రభుత్వంపై ఇలాంటి చర్యలు సరి కాదన్నారు. ఇలాంటి చట్టాల వల్ల ప్రజాస్వామ్యంపై ఆందోళన కలుగుతుందన్నారు. ఈ బిల్లు విషయమై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును తాము అతిక్రమించలేదన్నారు.
ప్రజలను అవమానించడమే: కేజ్రీవాల్
ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలుపడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది బ్లాక్డే అని పేర్కొన్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అధికారాలను కేంద్రం దొడ్డిదారిన లాగేసుకుందని దుయ్యబట్టారు. ఇది ఢిల్లీ ప్రజలను అవమానించడమేనన్నారు. వచ్చే ఏడాది జరుగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఢిల్లీ ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వబోరని స్పష్టంచేశారు. తనతో, తన ప్రభుత్వం చేస్తున్న పనితో పోటీపడలేక కేంద్రం ఢిల్లీ ప్రజలను టార్చర్ చేస్తున్నదని ఆరోపించారు.
కరుణానిధికి బీఆర్ఎస్ ఎంపీల నివాళి
పార్లమెంట్లోని డీఎంకే కార్యాలయంలో కరుణానిధి చిత్రపటానికి బీఆర్ఎస్ ఎంపీలు నివాళులర్పించారు. సీఎంగా కరుణానిధి తమిళనాడుకు ప్రజారంజక పాలనను అందించారని కొనియాడారు.
మణిపూర్పై వాయిదా తీర్మానం
మణిపూర్ అల్లర్లపై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఉభయ సభల్లో సోమవారం వాయిదా తీర్మానం ఇచ్చింది. మిగతా అంశాలన్నీ పక్కన పెట్టి రూల్ 267 కింద చర్చ జరగాలని డిమాండ్ చేసింది. అయితే బీఆర్ఎస్ ఎంపీల డిమాండ్ను ఉభయ సభల అధిపతులు అంగీకరించలేదు.