హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని నెహ్రూ అవలంబించిన దార్శనికతను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు. స్వాతంత్య్రం సిద్ధించిన తొలినాళ్లలో పంచవర్ష ప్రణాళికలు రూపొందించి నెహ్రూ దేశాన్ని సరైన మార్గంలో నడిపించారని గుర్తుచేశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఆ స్ఫూర్తిని తుంగలోకి తొక్కిందని ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అనేక అంశాలను ప్రస్తావించారు.
మోదీ ప్రభుత్వం అన్ని రంగాల్లో దేశాన్ని పతనావస్థకు చేర్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వరంగాలను నెలకొల్పి జాతికి సంపద సృష్టిస్తే బీజేపీ ప్రభుత్వం ఆ సంస్థలను అప్పనంగా అమ్మేస్తుందని ధ్వజమెత్తారు. ఆనాడు భారతీయ ఆత్మను ప్రతిబింబించే విధంగా నెహ్రూ పనిచేసినట్టే… నేడు జాతీయస్థాయిలో సీఎం కేసీఆర్ కూడా భావసారుప్యత శక్తులను ఏకం చేయటంలో ముందుండాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నదని ప్రశంసించారు. దేశాన్ని విచ్చిన్నకర శక్తుల నుంచి కాపాడి లౌకిక, సామ్యవాద పద్ధతిలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ ముందుకు సాగాలని కోరారు.