హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తున్న కేంద్రం.. తెలంగాణకు మాత్రం ఒక్క పైసా సాయం చేయకుండా వివక్షను ప్రదర్శిస్తున్నదని శాసనసభ వ్యవహారాలు, ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అయినా కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా రాష్ట్ర నిధులతోనే సహాయక చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం ప్రకారం తక్షణ సహాయక చర్యలు చేపట్టి ప్రాణ, ఆస్తి నష్టాన్ని చాలావరకు తగ్గించినట్టు వివరించారు. వరద నష్టంపై శుక్రవారం శాసనసభలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్బాబు, అక్బరుద్దీన్ ఒవైసీ, సండ్ర వెంకటవీరయ్య, రఘునందన్రావు తదితరులు లేవనెత్తిన అంశాలకు మంత్రి వేముల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘ప్రకృతి వైపరీత్యాలను మనం ఎవ్వరం ఊహించలేం.. దానిని అడ్డుకోలేం. ముందస్తు జాగ్రత్త చర్యల వల్ల ప్రకృతి వైపరీత్యాలతో జరిగే ప్రాణ, ఆస్తి నష్టాన్ని మాత్రం నిలువరించగలం’ అని సీఎం కేసీఆర్ ఎప్పుడూ మాకు దిశానిర్దేశం చేస్తుంటారని, మొన్న వారంపాటు కురిసిన అతి భారీ వర్షాల సందర్భంగా సీఎం ఆదేశాల ప్రకారం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి నష్టాన్ని చాలావరకు నివారించినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఏడాది సగటు వర్షపాతం 90 సెంటీమీటర్లు కాగా, ఇటీవలి వర్షాలకు ఇందులో 75 శాతం వర్షపాతం కేవలం 6 గంటల్లోనే నమోదైందని వివరించారు.
ఈ కుంభవృష్టి వల్ల జరిగే నష్టాన్ని సీఎం కేసీఆర్ ముందే అంచనా వేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో వందలమంది ప్రాణాలను కాపాడామని మంత్రి వేముల చెప్పారు. స్వయంగా సీఎం కేసీఆర్ ప్రతిక్షణం వరద పరిస్థితిని సమీక్షించారని, ప్రాజెక్టులవారీగా గోదావరి ఉధృతిని గంట గంటకూ సమీక్షించారని వెల్లడించారు. విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టామని, 8 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 4 బోట్లు (ఒకో టీంకు 20- 22 మంది నిష్ణాతులు), విశాఖపట్నం నుంచి అదనంగా మరో రెండు బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హెలికాప్టర్లతో భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెంలో వరద సహాయక చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఆర్మీతో మాట్లాడి 90 మందితో కూడిన టీంను కూడా సిద్ధం చేశామని, జిల్లాల్లో ఉన్న రెగ్యులర్ ఫైర్ టీంలు అందుబాటులో ఉండగా, 18 ఫైర్ టీమ్స్, 18 బోట్లు, 16 రిలీఫ్ వెహికిల్స్తో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టామని వివరించారు. వారు మోరంచపల్లిలో 1,500 మందిని రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారని గుర్తుచేశారు. వరదలకు ప్రభావితం అయిన 139 గ్రామాల్లో 7,870 ఇండ్ల నుంచి 27,063 మందిని 157 పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించినట్టు తెలిపారు. అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు చేపట్టామని తెలిపారు.
మిషన్ కాకతీయలో చేపట్టిన చర్యల వల్ల చెరువులు పటిష్ఠంగా తయారై ఎకువగా గండ్లు పడలేదని ప్రశాంత్రెడ్డి చెప్పారు. కొద్దిగా గండి పడ్డ చెరువులకు కూడా ఇరిగేషన్ శాఖ సిబ్బంది సకాలంలో పునరుద్ధరణ చర్యలు చేపట్టారని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో వరదలు వచ్చినప్పుడు ఒకసారి 11 వేలు, మరోసారి 4 వేల చెరువులు తెగితే, మిషన్ కాకతీయ వల్ల ఈసారి వర్షాలకు 300 చెరువులు మాత్రమే కట్టలు తెగాయని చెప్పారు. అధికారులు ప్రజా రవాణాకు ఎకడా ఇబ్బంది రాకుండా తెగిన రోడ్లు, కల్వర్టులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించారని తెలిపారు.
తెలంగాణకు పైసా ఇవ్వడానికి ఒప్పుకోని కేంద్రం.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రం నిధుల ‘వరద’ పారిస్తున్నదని మంత్రి వేముల పేర్కొన్నారు. కర్ణాటకలో వరదలు వస్తే అప్పటి సీఎం లేఖ రాసిన వెంటనే స్పందించి రూ.669 కోట్లు విడుదల చేసిందని, గుజరాత్లో వరదలు వస్తే ప్రధాని వెళ్లి రూ.500 కోట్లు ఇచ్చి వచ్చారని గుర్తుచేశారు. 2020లో వచ్చిన వరదలకు 2022 ఏప్రిల్ 5న కేంద్రం 16 రాష్ట్రాలకు నిధులు మంజూరు చేయగా, అందులో తెలంగాణకు మాత్రం చోటు లభించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీకి రూ.351.43 కోట్లు, గుజరాత్కు రూ.1,000 కోట్లు, కర్ణాటకకు రూ.994.27 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.600 కోట్లు, ఒడిశాకు రూ.500 కోట్లు, బీహార్కు రూ.1,038 కోట్లు, మహారాష్ట్రకు రూ. 355.39 కోట్లు, తమిళనాడుకు రూ.352.85 కోట్లు విడుదల చేసిందని గుర్తుచేశారు. 2018-19 నుంచి 2021-22 వరకు అన్ని రాష్ట్రాలకు విపత్తు సాయం కింద కేంద్రం రూ.44,219 కోట్లు విడుదల చేస్తే, ఇందులో తెలంగాణకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదని, ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ పార్లమెంట్ సాక్షిగా 2022 జూలై 19న వెల్లడించినట్టు చెప్పారు.
ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురుచూడకుండా సీఎం కేసీఆర్ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నారని మంత్రి కొనియాడారు. 2020లో హైదరాబాద్లో భారీ వరదలు వచ్చినప్పుడు కేంద్రం స్పందించకపోవడంతో సీఎం తక్షణం రూ.650 కోట్లు విడుదల చేసి నష్టపోయినవారికి, రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గత ఏడాది అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ఎకరాకు రూ.10 వేల చొప్పున 4.5 లక్షల ఎకరాలకు రూ.455 కోట్లు ప్రకటించి ఇప్పటికే రైతులకు రూ.150 కోట్లు పరిహారం అందించారని చెప్పారు. మిగిలినవారికి దశలవారీగా విడుదలచేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత వరదలకు తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. రైతులను మభ్యపెట్టడమే కాంగ్రెస్ విధానమని, ఏండ్లుగా ఇదే చేస్తున్నారని విమర్శించారు. వారి బండారం బయటపెడుతుండటంతో కావాలనే సభను వాకౌట్ చేస్తున్నారని ఆరోపించారు. తద్వారా వారి చేతగాని తనాన్ని వారే బయటపెట్టుకున్నారని ఎద్దేవాచేశారు.
గుజరాత్లో వర్షం పడితే.. మోదీకి పడిశం పడుతుందని సోషల్ మీడియాలో ఓ జోక్ ప్రచారం అవుతున్నదని మంత్రి గుర్తుచేశారు. సొంత రాష్ట్రంలో ఎప్పుడు వరద వచ్చినా ప్రధానిగా ఆయన వెంటనే స్పందిస్తారని, సమగ్ర నివేదికలు ఢిల్లీకి చేరకముందే వేల కోట్ల నిధులు ప్రకటిస్తారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రజలను ఒకలా, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ప్రజలను మరోలా చూస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. 2016 సెప్టెంబర్, 2020 అక్టోబర్లో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రూ.8,851 కోట్ల నష్టం జరిగినట్టు కేంద్ర బృందం అంచనా వేసిందని తెలిపారు. 2018-19 నుంచి 2021-22 వరకు ఇతర రాష్ట్రాలకు విపత్తు సాయం కింద కేంద్రం రూ.44,219 కోట్లు విడుదల చేసిందని, కానీ తెలంగాణకు ఒక్క పైసా సాయం చేయలేదని చెప్పారు. 2020 అక్టోబర్లో హైదరాబాద్లో చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదైందని, దీంతో రూ.5 వేల కోట్ల నష్టం జరుగగా, తక్షణ సాయంగా రూ.1,350 కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వయంగా లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. అయినా కేంద్రం నుంచి కనీస స్పందన రాలేదన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి వరద సాయం చేయాలని కోరినా పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు.
విపత్తుల సదర్భంగా రాష్ర్టాలు వాడుకునేందుకు వీలున్న స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (ఎస్డీఆర్ఎఫ్)కు కేంద్రం సవాలక్ష ఆంక్షలు విధుస్తూ వాటిని వాడుకోకుండా చేస్తున్నదని, కేంద్రం అందించే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్) నుంచి మాత్రం ఒక్క పైసా కూడా ఇవ్వడంలేదని మంత్రి మంత్రి ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వ ఆంక్షలతో వాడుకోవడానికి వీలు లేకుండా ఉంటే..రాష్ట్ర ప్రభుత్వమే తమ సొంత నిధులను అందించిందని చెప్పారు. కరోనా సమయం లో, వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలు పునరుద్ధరణ కోసం, పంట నష్ట సహాయం కోసం, జీహెచ్ఎంసీ పరిధిలో వరదలప్పుడు ఒకో కుటుంబానికి రూ.10 వేల చొప్పున(ఎస్డీఆర్ఎఫ్లో కేంద్రం నిబంధనల ప్రకా రం రూ.1,800 చొప్పున మాత్రమే ఇవ్వొచ్చు) రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు.