హుస్నాబాద్/చిగురుమామిడి/చొప్పదండి, ఫిబ్రవరి 27: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహితయాత్ర మంగళవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మంత్రి పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యాలు చేశారంటూ సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. పలుచోట్ల కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు నడిరోడ్డుపై తన్నుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం రాములపల్లి గ్రామంలోకి ప్రజాహితయాత్ర ప్రవేశించగానే.. బండి గ్యోబాక్ అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తకు తీవ్రగాయాలయ్యాయి.
బీజేపీ యాత్రపై కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడంతో వివాదం సద్దుమణిగింది. హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటుచేసిన బీజేపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. ఇరువర్గాలు పరస్పరం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలోనూ బండి సంజయ్ యాత్ర సందర్భంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. బొమ్మనపల్లిలో సంజయ్ బస చేసిన క్యాంపును ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించగా, బీజేపీ నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ, సిద్దిపేట పోలీసుల ఆధ్వర్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. మరోవైపు క్యాంపునకు వెళ్తున్న బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని పోలీసులు అడ్డుకున్నారు.
పరిస్థితి సద్దుమణిగిన తర్వాత పోలీసులు అనుమతించడంతో యాత్ర యథావిధిగా సాగింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలోని బస్టాండ్ వద్ద కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు ఉల్లంపల్లి, హుస్నాబాద్ రహదారి మధ్య సంజయ్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. కాగా, సంజయ్పై చర్యలు తీసుకోవాలంటూ చిగురుమామిడి, హుస్నాబాద్, చొప్పదండి, గన్నేరువరం, రుద్రంగి తదితర పోలీస్స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. వేములవాడ పట్టణంలోనూ, శంకరపట్నం మండల కేంద్రంలోని కరీంనగర్-వరంగల్ రహదారిపై బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.