ములుగు : యునెస్కో ప్రపంచ వారసత్వ సందపగా గుర్తించిన వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం సందర్శించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ములుగు జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు హరితగట్టమ్మ గ్రాండ్ హోటల్ వద్ద జిల్లా ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాలంపేటకు చేరుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు.
ఆ తర్వాత ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దేవాలయాన్ని సందర్శించిన సీజేఐ దేవాలయ శిల్పకళతో పాటు రామప్ప ఆలయ విశిష్టతను తెలుసుకునేందుకు సాయంత్రం 7 గంటల వరకు ఆలయ ఆవరణ మొత్తం పరిశీలించనున్నారు. ఆయన వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర హైకోర్టు ఉన్నతాధికారులు, వరంగల్ కోర్టు ఉన్నతాధికారులు, మానుకోట ఎంపీ మాలోత్ కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు.