పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు తేజాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్ పురస్కారం అందుకోనున్న శ్రీకృష్ణ ఎల్ల, శ్రీమతి సుచిత్ర ఎల్ల, శ్రీ నాదెళ్ల సత్యనారాయణ, పద్మశ్రీ కి ఎంపికైన శ్రీ గరికిపాటి నరసింహారావు, కీర్తిశేషులు శ్రీ గోసవీడు షేక్ హసన్, శ్రీ దర్శనం మొగిలయ్య, శ్రీ రామ చంద్రయ్య, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, శ్రీమతి పద్మజ రెడ్డిలకు ఆయన పేరు పేరునా అభినందనలు తెలిపారు.
తెలుగుజాతి కీర్తి పతాకను కోవిడ్ టీకా ఆవిష్కరణతో విశ్వ వినువీథుల్లో ఎగురవేసిన ఎల్లా దంపతులు, అతిపెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీకి సారథ్యం వహిస్తున్న శ్రీ నాదెళ్ల సత్యనారాయణ పద్మభూషణ్ కు ఎంపికవడం హర్షనీయమని జస్టిస్ రమణ అన్నారు. చక్కని తెలుగు వాచకంతో, అర్థవంతమైన ప్రవచనాలతో తెలుగు సాహితీ లోకాన్ని సుసంపన్నం చేసిన శ్రీ గరికిపాటి నరసింహారావు గారు, విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన ఇతర పద్మశ్రీ అవార్డు గ్రహీతలు తెలుగు జాతికి గర్వకారణమని జస్టిస్ రమణ కొనియాడారు.