CJI Justice Chandrachud | దిగువ కోర్టుల్లోనే కాకుండా.. హైకోర్టుల్లోనూ మౌలిక సదుపాయాల కొరత ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. రాజేంద్రనగర్లో కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న ప్రభుత్వం, హైకోర్టు సీజేఐని ఆయన అభినందించారు. కొత్త భవనంలో స్త్రీలు, దివ్యాంగులకు విభిన్న సౌకర్యాలుండాలన్నారు. న్యాయవ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్ను వినియోగించుకోవాలని.. ఇటీవల ఈ-కోర్టు పథకంలో భాగంగా పలు చోట్ల ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయని తెలిపారు.
ప్రజలకు న్యాయసేవలు చేరువయ్యేలా రావాలని ఆకాంక్షించారు. బ్రిటీష్ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని.. మారినకాలంతో పాటు న్యాయస్థానాల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు. యువత వేగంగా మార్పులు కోరుకుంటుందన్నారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధేతో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట, బుద్వేల్ గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయానికి చెందిన వందెకరాల భూమిని హైకోర్టు కోసం కేటాయించిన విషయం తెలిసిందే. నిర్మాణం కోసం రూ.500కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా.