హైదరాబాద్, ఆగస్టు 3(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని వర్గాలతో పాటు రేషన్ డీలర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 2014 ముందు టన్ను బియ్యానికి రూ.200 మాత్రమే ఉన్న కమీషన్ను సీఎం కేసీఆర్ మానవతాదృక్పథంతో రూ.900కు పెంచారని గుర్తుచేశారు. రేషన్ డీలర్లందరికీ అనేక సౌకర్యాలు కల్పించారని కొనియాడారు. గురువారం సచివాలయంలో రేషన్ డీలర్ల సమస్యలపై మంత్రి గుంగుల సమీక్షించారు.
సమావేశంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి, రేషన్ డీలర్ల గౌరవాధ్యక్షుడు దేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం ప్రతినిధులు వారి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. రేషన్ పోర్టబిలిటీ ఇతరత్రా కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ డీలర్లు ఆదాయం కోల్పోయారని, వారికి గౌరవప్రదమైన కమీషన్ వచ్చేలా చూడాలని కోరారు. గ్రామీణ, మున్సిపల్, కార్పొరేషన్ పరిధుల్లోని రేషన్ డీలర్లకు సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకొంటామని మంత్రి హామీ ఇచ్చారు. రేషన్ డీలర్ల సమస్యలపై కూలంకషంగా చర్చించిన తర్వాత ఈ అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.