హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణలో తెలంగాణ గణనీయ ప్రగతి సాధించిందని, దేశంలోనే రెండోస్థానంలో నిలిచిందని, యాసంగి ధాన్యం సేకరణలో మొదటిస్థానం సాధించిందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. 2014 నుంచి ఈ వానకాలం వరకు 1.10 కోట్ల మంది రైతుల నుంచి 671.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని, ఇందుకు రూ.1.21 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో వేసిందని వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో పౌరసరఫరాల శాఖ అంచనాలను మంత్రి గంగుల గురువారం సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశకత్వంలో రైతుల పంటను సేకరిస్తూ, పేదల కడుపు నింపుతూ, వినియోగదారుల హకుల్ని కాపాడడమే లక్ష్యంగా పౌరసరఫరాలశాఖ పనిచేస్తున్నదని మంత్రి కొనియాడారు. పీడీఎస్ ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ రూ.1,120 కోట్లను కలిపితే పౌరసరఫరాలశాఖకు భారీగా రూ.3117 కోట్లను కేటాయించారని చెప్పారు. అందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2014లో కేవలం 24.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, ఇప్పుడు 1.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు చెప్పారు. గత మూడేండ్లుగా వరుసగా కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరిస్తున్న ఎకైక రాష్ట్రం తెలంగాణేనని కొనియాడారు.
పెండ్లి రోజే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, హరిప్రియా బానోతు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. జాప్యం లేకుండా కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. లగ్న పత్రిక రాయించుకున్న రోజే దరఖాస్తు చేసుకుంటే పెండ్లి పందిట్లోనే చెక్కులు పంపిణీ చేయటానికి మార్గం సులువు అవుతుందని మంత్రి చెప్పారు.
బీసీ సంక్షేమశాఖ బడ్జెట్ అంచనాలను గురువారం అసెంబ్లీలో మంత్రి గంగుల కమలాకర్ సమర్పించారు. ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి వైఎస్ నుంచి రాష్ట్రం ఏర్పడే వరకు రూ.10,202 కోట్లను కేటాయిస్తే, రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు రూ.44,672 కోట్లను కేవలం బీసీ సంక్షేమానికే కేటాయించారని తెలిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన 45 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో బీసీలకు నికరంగా రూ.2 వేల కోట్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలోనే తొలిసారిగా రూ.6,229 కోట్ల 20 లక్షల బడ్జెట్ను బీసీలకు సీఎం కేసీఆర్ కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. కల్యాణలక్ష్మి బీసీల కోసం రూ.2000 కోట్లు, బీసీ సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.1550 కోట్లు, ఎంజేపీ సొసైటీలకు రూ.880 కోట్లు, సంక్షేమ హాస్టళ్లకు రూ.334 కోట్లు, బీసీ కార్పొరేషన్కు రూ.303కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్కు రూ.301 కోట్లు, ఫెడరేషన్లకు రూ.561 కోట్లు, బీసీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకానికి రూ.71 కోట్లు, బీసీ స్టడీ సరిళ్లకు రూ.27 కోట్లు, ఆత్మగౌరవ భవనాలకు రూ.90 కోట్లు, బీసీ కమిషన్కు రూ.10 కోట్లు కేటాయించారని వివరించారు.