చొప్పదండి/చెన్నూర్, ఆగస్టు 26: రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతవుతాయని, బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని, రాష్ట్రంలో మరోసారి అభివృద్ధి జైత్రయాత్ర కొనసాగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. చొప్పదండి, చెన్నూరు నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత వారు మొదటిసారిగా శనివారం చొప్పదండి, చెన్నూరు పట్టణాల్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
చొప్పదండిలో పార్టీ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో వరలక్ష్మి ఫంక్షన్హాల్ నుంచి రెండు వేల మంది, వెయ్యి బైకులతో అంబేదర్ చౌరస్తా వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో క్రేన్ సహాయంతో ఎమ్మెల్యేకు భారీ గజమాల వేసి, శాలువాతో సన్మానించారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇందారం వద్ద బీఆర్ఎస్ శ్రేణలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్నేతకాని, ఎమ్మెల్సీ దండె విఠల్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్, మాజీ విప్ నల్లాల ఓదెలు, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు సహా నియోజకవర్గంలోని పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులు పట్టి ఆశీర్వదించారు. ఇందారం నుంచి జైపూర్, భీమారం, కిష్టంపేట మీదుగా చెన్నూర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చెన్నూర్ పట్టణంలో నిర్వహించిన సభలో విప్ బాల్క సుమన్ ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో మరోసారి అభివృద్ధి జైత్రయాత్ర కొనసాగుతుందని తెలిపారు. తనపై ప్రజలు చూపిన అభిమానానికి రుణం తీర్చుకోలేనని చెప్పారు.