అపోహలు నమ్మవద్దు
ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావడం అభినందనీయం
వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన
నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న రెండోదశ కార్యక్రమం
నిత్యం 100-150 మందికి టీకా
‘నమస్తే’తో డీఎంహెచ్వో ధన్రాజ్
నిర్మల్ అర్బన్, మార్చి 17 : కరోనా వైరస్ను నియంత్రించడంలో కొవిడ్-19 వ్యాక్సిన్ సురక్షితంగా పనిచేస్తున్నదని నిర్మల్ డీఎంహెచ్వో ధన్రాజ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో రాష్ట్రంలో కరోనా వైరస్ను కట్టడి చేసినట్లు చెప్పారు. అంతేవేగంతో బాధితులకు ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందించి, ప్రాణాలను కాపాడగలిగామన్నారు. కోట్లాది మంది టీకా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ప్రభుత్వం టీకాను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. టీకాతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావని, వందశాతం సురక్షితమని చెప్పారు. ఇప్పటికే ఫ్రంట్లైన్ సిబ్బందితో పాటు పోలీస్ శాఖ, మున్సిపల్ సిబ్బంది, ప్రైవేట్ దవాఖాన వైద్యులు, సిబ్బందికి మొదటి, రెండో డోసు టీకా విజయవంతంగా అందించినట్లు వెల్లడించారు. రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని చెప్పారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ దవాఖాన, భైంసా ఏరియా ఆసుపత్రిలో ప్రతి రోజూ 100-150 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకుంటున్నారని తెలిపారు. వ్యాక్సిన్ విశిష్టతలు, ప్రాధాన్యతను వివరించేందుకు వైద్యారోగ్యశాఖ విస్తృత ప్రచారం చేస్తున్నదని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లతో ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, 45-60 ఏళ్ల ప్రజలు వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి దశలో 7233 మంది టీకా తీసుకోగా, రెండో దశలో 4475 మంది తీసుకున్నట్లు వెల్లడించారు. కొవిడ్-19 వ్యాక్సిన్పై సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని, అపోహలు ఉంటే స్వయంగా వైద్యులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు. కానీ టీకా తీసుకునేందుకు వెనుకడుగు వేయవద్దని తెలిపారు. ఇప్పటి వరకు టీకా ద్వారా ఎవరికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని స్పష్టం చేశారు.