మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి: పశ్య పద్మ
ఖైరతాబాద్, జనవరి 3: చిట్ఫండ్ కంపెనీల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ కోరారు. సోమవారం ఆమె సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చిట్టీల వ్యాపారం జోరుగా సాగుతున్నదని, ఆర్థిక అవసరాల కోసం చిట్టీలు కడుతున్న ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి బోర్డులు తిప్పేస్తున్నారని తెలిపారు. చిట్టీలు కట్టిన పాపానికి సకాలంలో డబ్బులు రాక బాధితులు అప్పులు చేసి అవసరాలను తీర్చుకోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదులపై విచారణ జరపాలని, బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.