తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తి తో పనిచేస్తున్నదని, దళితుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు అద్భుతమని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో విడుదలై చిరుతైగల్ కట్చి (వీసీకే) పార్టీ ఫ్లోర్ లీడర్ సింథనై సెల్వన్ ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలను కేంద్రం కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. వీసీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణలో పర్యటిస్తున్న ఆయన శనివారం బోరబండ ఎస్పీఆర్హిల్స్లోని దళిత్ స్టడీ సెంటర్ను సందర్శించారు.
ఈ సందర్భంగా వీసీకే పార్టీ బృందానికి సెంటర్ విశేషాలను, ప్రత్యేకతలను బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్, దళిత్ స్టడీ సెంటర్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య వివరించారు. అనంతరం మాసబ్ట్యాంక్లోని షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థను సందర్శించారు. కార్పొరేషన్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం దళిత సంక్షేమానికి చేపట్టిన చర్యలను కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎండీ కరుణాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వీసీకే బృందానికి వివరించారు.
అనంతరం సింథనై సెల్వన్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి చేపట్టిన పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలు తీరు బాగున్నదని కొనియాడారు. దళితబంధు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పెన్షన్లు, వసతిగృహాలు, సాలర్షిప్లు, ఉచిత కరెంటు, స్టడీ సరిళ్ల నిర్వహణ అమోఘమని కొనియాడారు. ఆయా కార్యక్రమాల్లో వీసీకే ఎమ్మెల్యే ఎస్ఎస్ బాలాజీ, ఎస్సీ కార్పొరేషన్ జీఎం ఆనంద్, ఎస్సీ సంక్షేమశాఖ అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి, తమిళనాడు అధికారులు కార్నెర్ స్టోన్, డాక్టర్ రిచర్డ్ దేవాదూస్, మురుగుప్పన్, కుమార్, డాక్టర్ వీఏ రమేశ్నాథన్, బీ ఆనంద్కుమార్, స్టేట్ రీసోర్స్ పర్సన్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.