వరంగల్, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మిర్చి రైతులు భగ్గుమన్నారు. తేజ మిర్చి క్వింటాల్కు జెండా పాట రూ.20,100 కాగా, రకరకాల కారణాలు చెప్తూ రూ.12 వేల నుంచి రూ.17 వేల వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారంటూ పలువురు రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్కు సుమారు 10 వేల మిర్చి బస్తాలు వచ్చాయి. ఇదే అదునుగా వ్యాపారులు మిర్చి ధరను అమాంతం తగ్గించారు.
ముందుగా నిర్ణయించిన ధరలోనూ కోతలు పెట్టారు. జెండా పాటలో తేజ రకం మిర్చి క్వింటాకు రూ.20,100 నిర్ణయించారు. వ్యాపారులు రకరకాల కారణాలు చెప్పి క్వింటాకు రూ.12 వేల నుంచి రూ.17 వేలకు కొనుగోలు చేశారు. వ్యాపారులు సిండికేట్గా మారి నాణ్యత సాకులు చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని, ముందుగా నిర్ణయించిన ధరనన్నా అందరికీ ఇవ్వాలని మిర్చి కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. అక్కడి నుంచి ర్యాలీగా మార్కెట్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి నిరసన తెలిపారు.
మార్కెట్ ప్రధాన గేట్ వద్దకు చేరుకొని రెండు గంటలు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఎనుమాముల పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి రైతులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. మార్కెటింగ్, పోలీసు అధికారులు.. రైతులు, వ్యాపారులతో మూడు గంటలపాటు చర్చలు జరిపారు. తక్కువ ధరలు పడ్డ రైతుల సరుకును పరిశీలించి ధరలు పెంచేలా చేస్తామని, ధరలు నచ్చని రైతులు మరుసటి రోజు అమ్ముకోవాలని సూచించారు. అనంతరం తక్కువ ధరలు పడ్డ రైతుల సరుకులను పరిశీలించి కొంత వరకు ధరలు పెంచి కొనుగోళ్లు చేపట్టారు. నాలుగు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం నుంచి మిర్చి కాంటాలు యథావిధిగా కొనసాగాయి.
తీవ్ర నిరాశలో మిర్చి రైతు
ఖమ్మం మార్కెట్లోనూ మిర్చి ధర అమాం తం తగ్గిపోయింది. వారం రోజుల క్రితం ఖమ్మం మార్కెట్లో తేజ రకం మిర్చి క్వింటా రూ.23,600 పలికింది. సోమవారం రూ.21 వేలకు పడిపోయింది. రెండు రోజుల సెలవుల తర్వాత సోమవారం మార్కెట్కు 20 వేల బస్తాల మిర్చి పంటను రైతులు తీసుకొచ్చారు. జెండా పాటలో క్వింటాకు రూ.21 వేలు ఒక్క లాట్కే పలికింది. కొందరు రైతులకు రూ.18,500 మాత్రమే దక్కింది. సోమవారం మిర్చి పంటను మార్కెట్కు తెచ్చిన రైతుల్లో 80 శాతం మందికి క్వింటాకు రూ.15 వేల నుంచి రూ.16 వేలు మాత్రమే ధర దక్కింది. ఆశలతో పంటను యార్డుకు తీసుకొచ్చిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది.
చేతులతోనే నాణ్యత నిర్ధారణ
మారుతున్న పరిస్థితులకు అనుగూణంగా మార్కెటింగ్శాఖలో అనేక మార్పులు వచ్చాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అవి అమలుకావడం లేదు. రైతులు, వ్యాపారులు, కార్మికుల సౌకర్యర్థం ఖమ్మం మార్కెట్లోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. సీసీ ఫుటేజీల పర్యవేక్షణ, జీపీఆర్ఎస్ కాంటాలు, పత్తి క్రయవిక్రయాల్లో ఈ-నామ్ విధానం, మిర్చి క్రయవిక్రయాల్లో ఈ-టామ్ విధానం అమల్లోకి తీసుకొచ్చారు. ఖమ్మం మార్కెట్లో రూ.36 లక్షలతో మూడు మిర్చి నాణ్యత యంత్రాలను సమకూర్చారు. మిర్చి పంటకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ఖరారు చేయదు. దీనిని అసరాగా చేసుకుని వ్యాపారులు నాణ్యత పేరుతో ధరను నిర్ణయిస్తున్నారు. ఎలాంటి సాంకేతికతను వినియోగించకుండా చేతులతో పంటను ముట్టుకుని నాణ్యతను నిర్ధారిస్తున్నారు.
పంట లేదు, ఇటు రేటు లేదు
ఎకరన్నంలో మిర్చి సాగు చేసిన. నాలుగు బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. మళ్లోసారి రెండు బస్తాలు రావచ్చు. లక్ష వరకు పెట్టుబడి పెట్టిన. క్వింటా 15,500 ధర పెట్టారు. పెంచాలని ఎంత అడిగినా ధర పెంచలేదు. అటు పంటకు రోగం వచ్చి ఆగమయ్యింది. ఇటు మార్కెట్ల ధర లేదు. ఏమి చేయాలో అర్థం అయితలేదు.
– భూక్యా సోమ్లా, ఎల్లంపేట, మరిపెడ
నాసిరకం అంటూ ధర తగ్గిస్తున్నరు
ఎకరంల మిర్చి పంట వేస్తే 6 బస్తాల తేజ రకం మిర్చి వచ్చింది. కూలీల ఖర్చు రూ.25 వేలు అయింది. క్వింటాకు రూ.10 వేలు అడుగుతున్నరు. ఈ ధరతో అమ్మితే మిర్చి ఏరిన కూలీల డబ్బులు కూడా వచ్చేటట్టు లేవు. వ్యాపారులు నాణ్యత పేరుతో ధరలు తగ్గించి నిలువు దోపిడీ చేస్తున్నరు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి మిర్చి రైతులకు న్యాయం జరిగేలా చూడాలి.
– చందాల సమ్మయ్య, నర్సంపేట
పెట్టుబడి వచ్చేటట్టు లేదు
మిర్చి పంటకు పెట్టుబడులు వచ్చేటట్టు లేవు. నిరుటి కంటే మిర్చి ధర తగ్గింది. తేజ రకం మిర్చి 17 బస్తాలు మార్కెట్కు తీసుకొస్తే క్వింటాకు రూ.11 వేలు అంటున్నరు. నాణ్యత పేరు చెప్పి ధర తగ్గిస్తున్నరు. ఎంత బతిమిలాడినా ధర పెంచుతలేరు.
– భూక్య రమేశ్, గూడూరు
మిర్చి రైతులను దోచుకుంటున్నారు..
వరంగల్ మార్కెట్కు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకొచ్చే రైతులను దోచుకొనే పద్ధతి మారాలి. రైతులకు న్యాయం జరిగేలా అధికారులు తీసుకోవాలి. సమస్యలు పరిష్కరించుకుండా నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– సోమిడి శ్రీనివాస్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
అమ్ముకోలేక ఇంటికి
12 బస్తాల మిర్చి మార్కెట్కు తీసుకొచ్చిన. జెండాపాట తర్వాత నా పంటకు వ్యాపారులు క్వింటాకు రూ.15 వేలు అడిగిర్రు. మొన్నటి ధర చూసి పంటను తీసుకొచ్చిన. మరీ ఇంత తక్కువ ధర అడగడం సరికాదు. నాకు ఈ ధర నచ్చలేదు. తిరిగి ఇంటికి పంటను తీస్కపోతున్న. ధర పెరిగిన తరువాత తీసుకొస్త.
– రామారావు, మల్లుపల్లి, కొణిజర్ల