కాజీపేట, ఏప్రిల్ 19: కాజీపేట రైల్వే జంక్షన్లో బుధవారం రాత్రి ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బంది, సీడబ్ల్యూసీ, రైల్వే ఐఆర్బీలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాకు గురవుతున్న పలువురు బాలురను పట్టుకున్నారు.
రైల్వే ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం.. దర్భంగా నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న దర్భంగా ఎక్స్ప్రెస్ రైలులో కొంతమంది వ్యక్తులు బీహార్ నుంచి సికింద్రాబాద్లో లేబర్ పనిచేయించేందుకు బాలురను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో రైలు కాజీపేట రైల్వే జంక్షన్కు చేరుకోగానే తనిఖీలు చేసి దాదాపు 35 మంది బాలురను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ 15 నుంచి 17 ఏండ్లలోపు ఉన్నట్టు తెలిపారు. బాలుర పూర్తి సమాచారాన్ని సేకరించి సీడబ్ల్యూసీ కమిటీకి అప్పగించనున్నట్టు చెప్పారు.