Kalyana Lakshmi | మంచిర్యాల, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం ఒకప్పుడు బాల్య వివాహాలతో ఇబ్బందిపడ్డ ఊరే. ఏ వాడకు పోయినా 14-17 ఏండ్ల వయసులో పెండ్లి చేసుకున్నవాళ్లే కనిపించేవారు. అభం.. శుభం తెలియని వయసులో ప్రేమ పెండ్లి చేసుకొని మోసపోయినోళ్లూ ఉన్నరు. అలా ఆగమైపోయిన కుటుంబాలు ఆ ఊళ్లో 40కిపైగా ఉంటాయని గ్రామస్థులే చెప్తున్నరు. కానీ, 2014 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కల్యాణలక్ష్మి పథకం ఎంతోమంది యువతుల్లో వెలుగులు నింపినట్టే మైలారంలోని యువతుల జీవితాల్లో సంతోషం నిండింది. ఈ పథకం వల్ల పెండ్లి కోసం 18 ఏండ్లు నిండాలన్న అవగాహన పెరిగింది. గత పదేండ్లలో ఆ ఒక్క ఊరిలోనే 80 మందికి కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ సాయం అందిందంటే అవగాహన ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. బాల్య వివాహాలు తగ్గటంతో మైలారానికి పట్టిన శని వదిలిపోయింది. ‘మా ఊరి బతుకులను కల్యాణలక్ష్మి మార్చేసింది’ అని గ్రామస్థులే చెప్తున్నారు.
కొందరు మేజర్ కాకముందే ప్రేమ పెండ్లిళ్లు చేసుకున్నరు.. కొన్ని పెద్దలు చేసిన బాల్య వివాహాలూ ఉన్నయ్.. చిన్న వయసులోనే పిల్లల్ని కనటంతో చాలా మంది యువతులు అనారోగ్యానికి గురయ్యారు. ఇంకొందరు ముసలివాళ్లలా వంగిపోయారు.
2014లో కేసీఆర్ సర్కారు కల్యాణలక్ష్మిని తీసుకొచ్చింది. 18 ఏండ్లు దాటితేనే సర్కారు ఇచ్చే ఈ సాయం అందుతది. దాంతో బాల్య వివాహాలు ఆగిపోయాయి. మేజర్ కాకముందు ప్రేమ పెండ్లిళ్లు నిలిచిపోయాయి. పిల్లల్ని కనే వయసు రావటంతో యువతులూ ఆరోగ్యంగా ఉంటున్నరు.
మాది భీమిని మండలం అక్కపెల్లి గ్రామం. మాకు 2018లో పెండ్ల య్యింది. అప్పుడు మానాన్న వద్ద పైసా లేకుండే. తెలిసినోళ్లను అప్పు అ డిగితే ఇయ్యలే. కానీ కేసీఆర్ సార్ పే దింటి ఆడపిల్లల పెండ్లికి లక్ష సాయం చేస్తున్నరని తెలిసి మా నాన్న సంబురపడ్డడు. ఓ షావుకారి దగ్గర అప్పు తెచ్చిండు. గా డబ్బులతోనే పెండ్లి చేసిండు. మాకు కల్యాణలక్ష్మి కింద పైసలు రాంగనే అప్పు కట్టినం.
– జంపం జ్యోతి భీమేశ్, మైలారం
మేము ఆదివాసీ మన్నేవార్ గిరిజన బిడ్డలం. మా ఆడబిడ్డలు పెద్ద చదువులు చదువుతున్నరు. మా పెద్ద బిడ్డ ప్రవళిక పదో తరగతి చదివింది. ఆర్థికంగా లేక పెద్ద చదువులు చదివించలేదు. ఆమెకు 2021లో పెండ్లి చేసినం. పెండ్లి కోసం బాగా అప్పుచేసినం. బయట రూ.2 లక్షలు అప్పు తెచ్చి బిడ్డ పెండ్లి చేసినంక మాకు కల్యాణలక్ష్మి కింద రూ.1,00,116 వచ్చినయి. వాటితో సగం అప్పు తీరింది. పేదోళ్లకు రూ.లక్ష ఉన్నఫలంగా రాడవడమంటే ఉట్టి మాట కాదు. మాలాంటోళ్లు ఏడాదంతా పనిచేసినా అంత డబ్బు సంపాదించం.
– ఎండల పద్మ-సత్యం, మైలారం
మాది పేద కుటుంబం. గుడిసెలో ఉంటున్న. నాకు ఇద్దరు ఆడపిల్లలు. కూలి పని చేసుకొని బతుకుత. నా పెద్ద బిడ్డకు పదేండ్ల కింద పెండ్లి చేసిన. అక్కడా, ఇక్కడా కాళ్లావేళ్లా పడి 50 వేల దాకా అప్పు జేసి లగ్గం చేసిన. ఆ అప్పు కట్టడానికి ఐదారేండ్లు ఊడిగం చేసిన. పేదోళ్ల ఆడపిలగాండ్ల పెండ్లి చేసుకునేందుకు ఎవరూ రాకపోయేది. ఎనిమిదేండ్ల కిందట నా చిన్న బిడ్డ గట్టక్కకు పెండ్లి చేద్దామని పిలగాండ్లను చూసిన. చూసినోళ్లంతా ఎంత ఇస్తవని అడిగిండ్లు. నా దగ్గర బేడ పైసా లేదు. అప్పుడే కేసీఆర్ సారు కల్యాణలక్ష్మి పథకం తీసుకొచ్చిండు. నాకు పాణం లేసొచ్చినట్టయింది. తెలిసిన పిలాగాన్ని చూసి పెండ్లి చేసిన. నెల వరకు నా ఖాతాలో రూ.50 వేలు వేసిన్రు. గా పైసలను నా బిడ్డకే ఇచ్చిన. కేసీఆరే నా చిన్న బిడ్డ పెండ్లి చేసిండు.
– అతిమెల లక్ష్మక్క, మైలారం