భువనగిరి: ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అభివృద్ధికి నాంది పలికిందని ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. ఈ స్వేచ్ఛ, స్వతంత్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారని తెలిపారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 చాలా కీలకమైన రోజన్నారు. నేటితో ఈ ప్రాంతం భారత యూనియన్లో విలీనమై 74 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదని వెల్లడించారు.
1947, ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర సంబురాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రానికై పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండగా మెజారిటీ సంస్థానాలు భారత దేశంలో విలీనమయ్యాయని, జునాఘడ్, కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రమే స్వతంత్రంగా ఉన్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుంది నాటి నిజాం ప్రకటించారని చెప్పారు. కానీ సంస్థానంలో ప్రజలకు కనీస మానవ హక్కులు లేవని, భూస్వాములు, జమీందార్లు, జాగీర్దార్లు, దేశ్ముఖ్లు ప్రజలను పీడించారని, ప్రైవేటు సైన్యం రజాకార్లు దమనకాండ కొనసాగిందన్నారు. రైతులు కౌలు కింద చేతికి అందిన పంటలో అగ్ర భాగం చెల్లించాల్సి వచ్చింది. 85 శాతం ప్రజలు మాట్లాడే స్థానిక భాష పై అణచివేత కొనసాగిందని వెల్లడించారు.
కనీస హక్కులు కోసం, దోపిడీ, దౌర్జన్యాలు ఎదిరించిన ప్రజలపై దాడులు, అత్యాచారాలు, దారుణాలు ఎక్కువ కావడంతో ప్రజలు ఎదురు తిరిగారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తమకు స్వాతంత్య్రం లేకపోవడాన్ని హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఆత్మరక్షణ కోసమైన ఆయుధం అందుకోక తప్పదని ఆడ, మగ తేడా లేకుండా అన్నివర్గాల ప్రజలంతా సాయుధ పోరాటానికి సిద్ధమయ్యారు. పలుగు, పార, కారం, రోకలి, వరిసెల, బరిసేలు ఆయుధాలుగా మారాయి. ఈ పోరాటంలో నాలుగున్నరవేల మంది ప్రాణాలు కోల్పోయినా మడమతిప్పకుండా తెగువ చూపించారని తెలిపారు.
నాటి పోరాటంలో తెలంగాణ మహిళలు కీలకపాత్ర పోషించడం విశేషమని చెప్పారు. ఆరుట్ల కమలాదేవి, చాకలి ఐలమ్మ, మల్లుస్వరాజ్యం లాంటి వారు సాయుధ పోరాటంలో తుపాకి చేతబట్టి పోరాటం చేశారు. నల్లగొండ జిల్లా ఈ పోరాటంలో కీలకపాత్ర పోషించిందని తెలిపారు. నిరంకుశత్వానికి, రజాకార్ల కిరాతక చర్యలకు ఎదురొడ్డిన ప్రాంతం చిట్యాల మండలం గుండ్రాంపల్లి, సూర్యాపేట మండలంలోని బాలెంల, ఇక వేములపల్లి మండలంలోని రావులపెంట కేంద్రంగా సాయుధ రైతాంగ పోరాటం సాగింది. నేటి తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ ఇచ్చింది ఆనాటి తరమేనని చెప్పారు. ఇదే ఉద్యమ స్పూర్తితో మరింత అభివృద్ధివైపు అడుగులు వేద్దామని సూచించారు.