హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మిగిలి ఉన్న కొద్దిపాటి భూ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం సంసిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో వంద ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేస్తున్నారు. ఈ రెవెన్యూ బృందాలు నిర్వహించే సదస్సులకు ఎమ్మెల్యేలు, మంత్రులు విధిగా హాజరై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. వచ్చిన దరఖాస్తులు ధరణిలోనే పరిష్కరించడానికి వీలుగా, ధరణిలో దరఖాస్తు అయ్యేలా రెవెన్యూ సదస్సుల వద్ద మొబైల్ ఈ- సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
మొబైల్ ఫోన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తారు. తమ భూము ల సమస్యలపై రైతులు సదస్సులో చెప్పే వాటిని నోట్ చేసుకొంటారు. వాటిని మాన్యువల్గా దరఖాస్తు చేయడానికి వీలుగా ఫార్మెట్ రూపొందిస్తారు. ఈ ఫార్మెట్లో రైతు పేరు, తండ్రి పేరు. భూమి ఏ సమస్య ఉందో వివరించేలా రూపొందిస్తారు. ఈ ఫార్మెట్లో పొందు పరిచిన దాని ఆధారంగా అక్కడే ఏర్పాటు చేసిన మొబైల్ ఈ- సేవ కేంద్రంలో ధరణి పోర్టల్లో దరఖాస్తు చేస్తారు. దానికి రసీదు ఇస్తారు. ఆ తరువాత అలా వచ్చిన దరఖాస్తులకు నిర్ణీత గడువు విధిస్తారు. ఆలోగా తాసిల్దార్లు పరిశీలించి కలెక్టర్కు రిపోర్ట్ పంపిస్తారు. ఆ రిపోర్ట్ ఆధారంగా కలెక్టర్ వాటిని పరిష్కరిస్తారు. ఈ మేరకు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి కలెక్టర్లకు మాడ్యూల్ ఇస్తారు. ఎమ్మెల్యే సమక్షంలోనే రెవెన్యూ సదస్సులు జరుగుతుండటంతో సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు.
రైతులు తమ భూ సమస్యలను పరిష్కరించుకోవడానికి రెవెన్యూ సదస్సులకు హాజరయ్యేలా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఈ నెల 11న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే కలెక్టర్ల సమావేశం తరువాత 15వ తేదీ నుంచి ఏ మండలంలో ఏ రోజు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తారో షెడ్యూల్ ఖరారు అవుతుంది. ఆ తరువాత ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో రెవెన్యూ యంత్రాగం ముందుగానే ప్రచారం నిర్వహిస్తుంది. ఫలానా తేదీన మండల కేంద్రంలో రెవెన్యూ సదస్సు జరుగుతుందని, అధికారులు, భూ రికార్డులన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి సమస్యలున్న రైతులు వచ్చి ప్రత్యేక బృందానికి వివరించి పరిష్కరించుకోవాలని గ్రామాల్లో కరపత్రాలు పంచడంతోపాటు దండోరా వేయిస్తారు. ఏ గ్రామం వాళ్లు, ఏ రోజు మండల కేంద్రానికి రావాలో తెలియజేస్తారు. ఆయా గ్రామాల సర్పంచ్ల సహకారంతో ఉద్యోగ, వ్యాపార రీత్యా ఊరి బయట ఉండేవారికి ప్రత్యేకంగా ఫోన్లు చేయించి పిలువనున్నారు. అందుబాటులో ఉన్న రైతులకు ఫోన్ నంబర్ల ద్వారా కూడా సమాచారం అందించే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలా ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా ప్రచారం నిర్వహించి, రైతులు సదస్సులకు వచ్చేలా చేయనున్నారు.