హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ) : బీజేపీ 12 ఏండ్లలో చేసిందేమిటని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మోదీ పన్నెండేండ్ల పాలనను, రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ సవాల్ చేశారు. మియాపూర్లో సోమవారం ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ బహిరంగ సభలో బీజేపీ నేతలపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చేవెళ్ల, మెదక్, మల్కాజిగిరి ఎంపీలతో పాటు కేంద్రమంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్ నగరానికి ఒక్క పైసా నిధులు తేవడం లేదని, మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తాను ఢిల్లీ వెళ్తే, వెనుకాలే కిషన్రెడ్డి ఢిల్లీకి వెళ్లి నిధులు రాకుండా కాళ్లలో కట్టెలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఆరు నగరాల్లో హైదరాబాద్ ఒకటని చెబుతూనే.. రెండున్నరేండ్లలో ఏదో అద్భుతం చేసినట్టు కాంగ్రెస్ మార్క్ మాటల గారడీని ప్రదర్శించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించి ఇరు పార్టీలు ఆడుతున్న రాజకీయ క్రీడలో మొత్తానికి నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు మారింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం చేపట్టిన ప్రాజెక్టులు, పూర్తిచేసిన అభివృద్ధి పథకాలేమిటో చెప్పకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అసలు రూపం బయటపడిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. హైదరాబాద్ను నిజమైన విశ్వనగరంగా మార్చిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్ విజనరీ ఆలోచనలతోనే సాగింది. ఐటీ రంగ విస్తరణ, ట్రాఫిక్ కష్టాల శాశ్వత పరిష్కారం కోసం ఆనాడు బీఆర్ఎస్ తీసుకొచ్చిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులే నేటికీ నగరానికి లైఫ్లైన్లుగా నిలిచాయి.
అధికారంలోకి వచ్చిన తొలి కార్యక్రమమే బీఆర్ఎస్ హయాంలో పూర్తిచేసిన గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి… సోమవారం అందుబాటులోకి తెచ్చిన బాచుపల్లి-మియాపూర్ ఫ్లైఓవర్ కూడా అదేనని విషయాన్ని మరచిపోయారు. ఆనాడు కేసీఆర్ దూరదృష్టితో పక్కా ప్రణాళికతో రూపకల్పన చేసి, నిధులు మంజూరు చేసిన ప్రాజెక్టులు నగర ముఖచిత్రాన్నే మార్చేశాయి. పారిశ్రామిక, ఐటీ కారిడార్లను అనుసంధానిస్తూ, భవిష్యత్ అవసరాలను ముందే ఊహించి నిర్మించిన ఫ్లైఓవర్లు, అండర్పాస్లన్నీ గత బీఆర్ఎస్ పాలనకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తుండగా, కేసీఆర్ ప్రభుత్వం వేసిన పునాదులపై నిలబడి కాంగ్రెస్ నేతల ప్రగతి మాటలు నగరవాసులు విస్తుపోతున్నారు.