CM KCR | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సచివాలయం ప్రాంగణంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ప్రజలకు పెన్షన్ రూ.200 మాత్రమే ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.2,016కు పెంచిందని తెలిపారు. దివ్యాంగులకు రూ. 3,016 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. 2014 లో 29 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉండగా, ఇప్పుడు 44 లక్షలకు పైగా ఉన్నారని వెల్లడించారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం కింద ఇప్పటివరకు 13.16 లక్షల మంది ఆడపిల్లల వివాహాలను ప్రభు త్వం జరిపించిందని, ఇందుకు రూ.11 వేల కోట్లు వెచ్చించిందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను సీఎం తన ప్రసంగంలో ఆవిష్కరించారు.
నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ, సహాయ కార్యక్రమాలను చేపట్టింది. నూలు, రంగులపై కేంద్రం 10 శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తే, తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నది. పావలా వడ్డీకే రుణాలిస్తూ, 2010-17 మధ్య బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు రూ.లక్ష వరకు మాఫీ చేశాం. 2017 నుంచి బతుకమ్మ చీరల తయారీని వారికే అప్పగించాం. వీటికోసం రూ.1,727 కోట్లు వెచ్చించాం.
రాష్ట్ర ప్రభుత్వం జల వనరులను అభివృద్ధి చేయడమేకాకుండా రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో చేప, రొయ్య పిల్లల పెంపకాన్ని చేపట్టింది. వాటిపై హక్కులను మత్స్యకారులకే కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. చేపల పెంపకం కోసం ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేసింది. ప్రమాదంలో మరణించే మత్స్యకారుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ ద్వారా రూ.4 లక్షలు, ప్రభుత్వం మరో రూ.5 లక్షలు, మొత్తంగా 9 లక్షల పరిహారం అందిస్తున్నది.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కల్లు దుకాణాలను ప్రభుత్వం తిరిగి తెరిపించింది. చెట్ల పన్ను రద్దు చేసింది. పన్ను బకాయిలను మాఫీ చేసింది. వైన్ షాపుల కేటాయింపుల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించింది. గీత కార్మికులకు రూ.5 లక్షల బీమా కల్పిస్తున్నది. 50 ఏండ్లు నిండిన గీత కార్మికులకు రూ.2,016 పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 65,668 మంది గీత కార్మికులకు పెన్షన్ల ద్వారా ఇప్పటివరకు రూ.800 కోట్లు అందజేసింది.
మైనార్టీ బాలుర కోసం 107, బాలికల కోసం 97 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది. 10 వేల మంది ఇమామ్లకు, మౌజన్లకు నెలకు రూ.5 వేల జీవన భృతిని అందజేస్తున్నది. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఓన్ యువర్ ఆటో, డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నది. అధికారికంగా రంజాన్, క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నది. ఇటీవల జైన మతస్థులకు మైనార్టీ హోదా కల్పించడంతో వారిలో సంతోషం నెలకొన్నది.
హైదరాబాద్లోని గోపన్పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదన్ను నా స్వహస్తాలతో ప్రారంభించాను. మహామహోపాధ్యాయుడు కోలాచల మల్లినాథ సూరి పేరుపై ఆయన స్వస్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించనున్నాం. బ్రాహ్మణ పరిషత్తు ద్వారా వేద/శాస్త్ర పండితులకు ఇస్తున్న గౌరవ భృతిని రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నాం. ఇందుకు అర్హత వయసును 75 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు తగ్గించాం. ప్రస్తుతం 3,645 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం వర్తిస్తుండగా, మరో 2,796 దేవాలయాలకు విస్తరింపజేస్తున్నాం. ఈ పథకం కింద అర్చకులకు నెలకు రూ.6 వేలు ఇస్తుండగా, రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నాం. వేద పాఠశాలల నిర్వహణకు ఇస్తున్న రూ.2 లక్షలను ఇకపై యాన్యువల్ గ్రాంట్గా ఇస్తాం అని సీఎం ప్రకటించారు.