కందనూలు/తిమ్మాజిపేట, మార్చి 26: వచ్చే జూన్లోపు సాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల పనులపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, పరిగి, వికారాబాద్ ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, ఆనంద్ తెలిపారు. ఈ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టు నిర్మిస్తుంటే కొందరు కావాలనే అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు.
ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర వద్ద, తిమ్మాజిపేట మండలం వెంకాయపల్లి గ్రామ సమీపంలోని వెంకటాద్రి రిజర్వాయర్ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతిపక్షాల ఆరోపణలకు చెక్ పెట్టేందుకే ప్రాజెక్టు పనులను సందర్శించినట్టు చెప్పారు. ఇప్పటికే వట్టెం రిజర్వాయర్ పనులు 85 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పనులు శరవేగంగా కొనసాగుతున్నా ప్రభుత్వంపై బురదజల్లేందుకు కొన్ని పార్టీలు యత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. వీరి వెంట వికారాబాద్, పరిగి జెడ్పీ, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు ఉన్నారు.