Cheruku Sudhakar | హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్రావు కలిసి చెరుకు సుధాకర్కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, గాయకుడు ఏపూరి సోమన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం అని భావించి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక పరిపుష్టి కలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, మధుయాష్కీ వంటి బీసీల నేతల స్థాయిని తగ్గిస్తూ అవమానకరంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చెప్తున్న సామాజిక న్యాయం కేవలం రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ మాటల్లో తప్ప ఆచరణలో లేదని విమర్శించారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ చివరకు మోసం చేసిందని దుయ్యబట్టారు. బీసీలకు కేటాయించిన 12 సీట్లలో ఐదు చోట్ల ఎప్పుడూ కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదని చెప్పారు. వీటిని పట్టుకుని బీసీలకు 12 సీట్లు ఇచ్చామంటూ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెక్కిరింపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా సమయంలో రేవంత్రెడ్డి అత్యంత అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు.