Cheruku Sudhakar | సూర్యాపేట : బీఆర్ఎస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో కౌంట్ లెస్ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల కాలంలో కోమటిరెడ్డి బ్రదర్స్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్నికలు దగ్గరికి వస్తా ఉంటే రాజకీయ నాయకులు విమర్శలు – ప్రతి విమర్శలు సాధారణం కానీ నకిరేకల్, సూర్యాపేట తుంగతుర్తిలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన భాషా, ప్రవర్తించిన తీరు అత్యంత అసహ్యకరంగా ఉందన్నారు. ఉద్యమకారులను అవమానించే రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని అధ:పాతాలానికి తొక్కాలని చూసిన రాజగోపాల్ రెడ్డి పక్కా కమర్షియల్ లీడర్ అని ఎద్దేవా చేశారు. నకిరేకల్, సూర్యాపేట, తుంగతుర్తిలలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎదుగుదల లేని మానసిక స్థితికి నిదర్శనం అన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి, దళిత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. నల్లగొండ జిల్లా ఉద్యమస్ఫూర్తిని అవమానించేలా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని చెరుకు సుధాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణరాష్ట్ర సమితి ఉద్యమ పునాది నుండే జగదీష్ రెడ్డి ఉన్నారని సుధాకర్ గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో రాజశేఖరరెడ్డి పాద సేవలో ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్కు జగదీష్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12కు 12 స్థానాలలో గులాబీ జెండా ఎగరేసిన సత్తా ఉన్న నాయకుడు జగదీష్ రెడ్డి అని తెలిపారు. మాటిమాటికి బీఆర్ఎస్ అభ్యర్ధులను అసెంబ్లీ గేటు తాకనీయమంటున్న రాజగోపాల్ రెడ్డి.. అసెంబ్లీ ఏమైనా ఆయన అయ్య జాగీరు కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
ఏ ఎమ్మెల్యే శాశ్వతం కాదన్నా కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి పార్లమెంట్ పరిధిలో శాసనసభ టికెట్లు ఇప్పిస్తామని కోట్లు దండుకున్నది నిజం కాదా? అని సుధాకర్ నిలదీశారు. అడ్డగోలుగా మాట్లాడేందుకు ఉమ్మడి నల్గొండ జిల్లా దొరల జాగీరు కాదన్నారు. మునుగోడు ప్రజలు ఇచ్చిన షాక్కు మతిభ్రమించిన రాజగోపాల్ రెడ్డి పిచ్చివాడిలా రోడ్లపై తిరుగుతుండని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి లాంటి పనికిరాని వాడితో చర్చలు జరిపే స్థాయి మాది కాదన్నారు. రమేష్ రెడ్డికి వయసు అయిపోలేదన్న రాజగోపాల్ రెడ్డి ఆయనకు ఏమై వయసు అయిపోయిందని బీజేపీని వీడారని సుధాకర్ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎందుకు దించాలో చెప్పే దమ్ము కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా ఉందా..? అంటూ చెరుకు సుధాకర్ సవాల్ విసిరారు. జీవితమంతా బ్రోకర్ పనులు చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ జోకర్ పనులను తక్షణమే బంద్ చేయాలి అని కోరారు. ప్రత్యామ్నాయం చూపించాలనుకునే కాంగ్రెస్ నాయకులు ముందు వారి ఎజెండా ఎందో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఓబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్న చెరుకు సుధాకర్, ఉదయపూర్ డిక్లరేషన్ను ఏ తుంగలో తొక్కారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. వీరేశంను వీరుడు అన్న రాజగోపాల్ రెడ్డి అదే వీరేశం హంతకుడు అన్నది నిజం కాదా? అంటూ చెరుకు సుధాకర్ ప్రశ్నించారు.