హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాలో కీమో థెరపీ చేయించుకొనే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో రూ.80 కోట్లతో నిర్మించిన ఎంఎన్జే నూతన ఆంకాలాజీ బ్లాకును కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్తో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ, ‘తెలంగాణ వస్తే ఏమొస్తది అని చాలామంది మాట్లాడారు.. ఇదిగో చూడండి 60 ఏండ్లలో 20 మెడికల్ కాలేజీలు వస్తే తెలంగాణ వచ్చాక కేవలం తొమ్మిదేండ్లలోనే 35 మెడికల్ కాలేజీలు వచ్చాయి. నాడు 2,950 ఉన్న మెడికల్ సీట్లను నేడు 7,990కి పెంచుకోగలిగాం’ అని పేర్కొన్నారు.
చరిత్రాత్మకమైన ఎంఎన్జే దవాఖానలో కొత్త బ్లాక్ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇంత మంచి బిల్డింగ్ను నిర్మించి ప్రభుత్వానికి అందించినందుకు అరబిందో ఫార్మాకు అభినందనలు తెలిపారు. కొత్త భవనం అందుబాటులోకి రావడంతో ఎంఎన్జేలో పడకల సంఖ్య 750కి పెరిగిందని తెలిపారు. అరబిందో ఫార్మా సీఎస్ఆర్ కింద రూ.80 కోట్లు వెచ్చించి భవనాన్ని నిర్మించి ఇస్తే.. ప్రభుత్వపరంగా రూ.60 కోట్లతో అన్ని సదుపాయలు కల్పించామని వెల్లడించారు. 750 పడకల సామర్థ్యంతో ఎంఎన్జే దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ దవాఖానగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంఎన్జేలో విమెన్ వింగ్, పీడియాట్రిక్తోపాటు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ కోసం ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. పిల్లల కోసం 120 పడకలతో ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని, ఇందులో క్యాన్సర్ చికిత్సతోపాటు విద్యనందించేందుకు ఒక టీచర్ను నియమించినట్టు చెప్పారు. ఇక్కడ పిల్లలకోసం లైబ్రరీ, ఆట స్థలాన్నికూడా కేటాయించినట్టు తెలిపారు. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కు ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశామని, వారికి ఆరోగ్య శ్రీ కింద జీవితాంతం ఉచితంగా మందులు అందజేస్తామని వెల్లడించారు.
స్వరాష్ట్రంలో ‘వైద్యం’ బలోపేతం
పెరుగుతున్న జనాభాను దృష్టిలోపెట్టుకొని సూపర్ స్పెషాలిటీ సేవలు పెంచడంలో గత ప్రభుత్వాలు విఫలం అయ్యాయని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ వైద్యరంగాన్ని ఎంతో పటిష్ఠం చేశారని చెప్పారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్జే దవాఖానలను బలోపేతం చేశారని తెలిపారు. నగరానికి నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణతో 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు. వైద్య విద్యకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నామని, దీంతో మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 55కు చేరుకుంటుందని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటినుంచీ క్యాన్సర్కు సంబంధించి ఆరోగ్య శ్రీ ద్వారా రూ. 800 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. నిరుడు క్యాన్సర్ రోగుల కోసం రూ.137 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. త్వరలో కీమో, రేడియో థెరపీ సేవలను జిల్లాలకు విస్తరిస్తామని ప్రకటించారు. టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా కాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు సైతం చేయనున్నట్టు వెల్లడించారు. అవసాన దశలో ఉన్న క్యాన్సర్ రోగులకోసం ప్రతి జిల్లాలో పాలియేటివ్కేర్తోపాటు ఆలనా బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆలనా టీమ్స్ రోగి ఇంటికి వెళ్లి, వారికి అవసరమైన చికిత్స అందిస్తాయని పేర్కొన్నారు. ఈ సేవలను కేంద్రం సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు.
మన ఆరోగ్యం మన చేతుల్లోనే
మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, మితంగా తిని అమితమైన ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలని మంత్రి సూచించారు. జంక్ఫుడ్ జోలికి పోకుండా ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించాలని, ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు, హరితహారం ద్వారా స్వచ్ఛమైన గాలి, కాళేశ్వరం జలాలతో వ్యవసాయానికి సాగునీరందించి స్వచ్ఛమైన ఆహారం అందేలా చర్యలు తీసుకొన్నారని వివరించారు. ఎంఎన్జే దవాఖాన శానిటేషన్, సెక్యూరిటీ నిర్వహణకు ముందుకొచ్చిన ప్రముఖ వైద్యులు అద్దంకి శరత్, సినీ నిర్మాత సునీతను మంత్రి హరీశ్రావు అభినందించారు. కార్యక్రమంలో ఎంఎన్జే డైరెక్టర్ డాక్టర్ ఎస్ జయలత, ఎమ్మెల్సీ ప్రభాకర్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అరబిందో ఫార్మా ఎండీ నిత్యానందరెడ్డి, అరబిందో డైరెక్టర్ రఘునాథన్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి, ఎంఎన్జే ఆర్ఎంవో డాక్టర్ నిర్మల, మాజీ ఆర్ఎంవో డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.